లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఊరట కలిగించేలా టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ముగిశాక కోహ్లీసేనకు మూడు వారాల విరామం ఇవ్వనుంది. సుదీర్ఘంగా బయోబబుల్లో ఉంటే ఆటగాళ్లు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉండడంతో సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి మంగళవారం వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా కివీస్తో కోహ్లీసేన డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు టెస్టు సిరీస్ ఆగస్టు 4న మొదలుకావాల్సి ఉంది. వీటి మధ్య ఆరు వారాల విరామం ఉండడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత కోహ్లీసేనకు మేనేజ్మెంట్ 20 రోజుల సెలవులు ఇవ్వనుంది. ఇంగ్లండ్తో పోరుకు సిద్ధమయ్యేందుకు జూలై 14న భారత ఆటగాళ్లందరూ ఒక్క చోటికి చేరనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్కు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు మధ్య ఆరు వారాల వ్యవధి ఉంది. ఆటగాళ్ల క్షేమం కోసం, వారు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు విరామం ఇవ్వనున్నాం. బ్రిటన్లో వారు తిరగొచ్చు. స్నేహితులను, కుటుంబ సభ్యులను కలుసుకోవచ్చు. ఇంగ్లండ్ బయలుదేరే ముందు కోహ్లీ, రవిశాస్త్రి కూడా బ్రేక్ గురించి మాట్లాడారు అని ఆ అధికారి చెప్పారు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్కు, ఇంగ్లండ్తో సిరీస్ మధ్య విరామం ఇస్తే ప్లేయర్లకు మానసికంగా బాగుంటుందని కెప్టెన్ కోహ్లీ చెప్పగా.. హెడ్కోచ్ శాస్త్రి కూడా మద్దతిచ్చిన సంగతి తెలిసిందే.