ఇంజినీరింగ్ పూర్తిచేసింది. అమెరికా వెళ్లాలన్న కల సాకారమైంది. మంచి ఉద్యోగం.
జీవిత భాగస్వామిదీ మంచి సంపాదనే. బిందాస్ లైఫ్. అంతలోనే, ‘సక్సెస్ అంటే
ఇదేనా?’ అన్న సందేహం. ‘మీకు రెక్కలున్నాయి. పాకడం కాదు, ఎగరడం నేర్చుకోండి’
అనే కలామ్ మాటలు ఆలోచింపజేశాయి. దీంతో వెనక్కి వచ్చేసింది దీప్యా లింగారెడ్డి.
తనిప్పుడు, డెయిరీ ఆంత్రప్రెన్యూర్. ఆ ప్రయాణమంతా ఆమె మాటల్లోనే..
‘లక్షల మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది’ అన్న సిద్ధాంతాన్ని నమ్ముతాన్నేను. ఆ ఆత్మవిశ్వాసంతోనే పాడి పరిశ్రమలో అడుగుపెట్టాను. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోని ఈసీఐఎల్లో. అమ్మ బ్యాంక్ మేనేజర్. నాన్న పశు సంవర్ధక శాఖలో ఉద్యోగి. కంప్యూటర్ సైన్స్లో ఇంజినీరింగ్ చేసి మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లాను. ఈ మధ్యలోనే వంశీకృష్ణతో పెండ్లి జరిగింది. ఆయన కెమికల్ ఇంజినీర్. నాసా ప్రాజెక్టులో పనిచేశారు. ‘ఎంత కాలమిలా? ఏదైనా వ్యాపారం చేద్దాం’ అన్న ఆలోచన వచ్చింది మాకు. అమెరికా వెళ్లే ప్రతి ఒక్కరూ తిరిగి రావాలనే ఉద్దేశంతోనే విమానం ఎక్కుతారు. కానీ, అక్కడికి వెళ్లాక ఎంత ప్రయత్నించినా వెనక్కి రాలేరు. ఆ జీవన విధానం, సంపాదన అలాంటివి. కానీ, మేం తొందరగానే బయటపడ్డాం. అగ్రదేశానికి టాటా చెప్పాం.
ఒక్కొక్కటి పెంచుకుంటూ..
2012లో తాండూరులో భూమి తీసుకున్నాం. మొదటగా నేలను సేంద్రియ సాగుకు అను
కూలంగా మార్చుకోవాలి. సారవంతం చేసి గడ్డి పెంచుకోవాలి. ఆలోపు కొన్ని పాడి పశువులు కొనుక్కోవాలి. ఇదంతా దశలవారీగా చేస్తూ వచ్చాం. ఆ మధ్యలో పాడి పరిశ్రమపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్నాం. ఇలా ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకుంటూ ‘అబ్సెల్యూట్ మిల్క్’ బ్రాండ్తో మార్కెట్లోకి వచ్చాం. కస్టమర్లలో మంచి పేరు వచ్చింది. పనీర్, కుండ పెరుగు, నెయ్యితో పాటు రోజువారీగా పాలు కావాలనీ జనం అడిగేవారు. కాకపోతే, తాండూరు నుంచి హైదరాబాద్కు తీసుకురావాలంటే రెండున్నర గంటల సమయం పడుతుంది. పాలు పాడయ్యే ప్రమాదం ఉంది. రోజూ మంచిగా పోసి.. ఒక్కరోజు తేడా జరిగినా పాల వ్యాపారం నిలవదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని శంషాబాద్లో రెండో యూనిట్ ప్రారంభించాం. దేశవ్యాప్తంగా ఇప్పుడు ‘అబ్సెల్యూట్ మిల్క్’ విక్రయాలు జరుగుతున్నాయి.
పాడి సంపద
కొవిడ్ తొలిదశ మాకు కలిసొచ్చిందనే చెప్పాలి. కరోనా పుణ్యాన ప్రజలకు పోషకాహారం పట్ల ఆసక్తి ఏర్పడింది. అంతకుముందు గుజరాత్ నుంచి ఎక్కువగా పాల ఉత్పత్తులు వచ్చేవి. లాక్డౌన్లో వాహనాల రాకపోకలు బంద్ కావడంతో మా ఉత్పత్తులకు ఆదరణ లభించింది. విక్రయాలు పెరిగాయి. మా దగ్గర గిర్రాజ్, కనకరాజ్ ఆవులు, ముర్రాజాతి బర్రెలు.. అన్నీ కలుపుకొని 600కు పైగా ఉన్నాయి. ఆవుల్ని, బర్రెల్ని వేరుగా ఉంచుతాం. పాడి పశువులను మేం ప్రేమగా చూసుకుంటాం. దూడలకు పాలిచ్చిన తర్వాత, ఉదయం ఏడు గంటలకు మేతకు వదిలేస్తాం. మధ్యాహ్నం 3 గంటల వరకు తిరిగి షెడ్డుకు వస్తాయి. సేంద్రియ సాగులో పండించిన రెండు రకాల గడ్డిని మేతగా పెడతాం. ఇప్పుడు 20 రకాల పాల ఉత్పత్తులను మార్కెట్కు సరఫరా చేస్తున్నాం. మా పరిశ్రమ ద్వారా నేరుగా వంద మందికి, పరోక్షంగా వందల మందికి ఉపాధి లభిస్తున్నది. ఉపాధి లేక కూలీ పనికి వెళ్తున్న తాండూరులోని కుటుంబాలకు పెరుగు కుండల తయారీ రూపంలో ఆదాయ మార్గం చూపిస్తున్నాం. డెయిరీ వ్యాపారానికి టెక్నాలజీని జోడించడం మా విజయానికి ప్రధాన కారణం. మొదట్లో ‘అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చి ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటున్నావా?’ అన్నారు చాలామంది. కానీ నేను పట్టించుకోలేదు. నాకొక ఐడియా ఉంది. రిస్క్ తప్పదని తెలుసు. సమస్యలు మనల్ని నాశనం చేయడానికి రావు, మనలోని శక్తి సామర్థ్యాలను వెలికి తీసేందుకే వస్తాయని విశ్వసిస్తాను. తక్షణ ఫలితాల కోసం నేనెప్పుడూ వెంపర్లాడలేదు. సంకల్పం గట్టిదైతే నవ్విన నాపచేనే పండుతుందని నిరూపించాను. అక్టోబర్ 30న భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ‘రైతునేస్తం పురస్కారం-2021’ అందుకోవడం సంతోషంగా ఉంది.
వ్యవసాయం గురించి అధ్యయనం
ఇండియాకు తిరిగి రావాలన్న ఆలోచన రాగానే, ‘వెళ్లి ఏం చేద్దాం’ అనే ప్రశ్నా తలెత్తింది. ముందుగా వ్యవసాయం గురించి అధ్యయనం చేశాం. అనుబంధంగా ‘ఫుడ్ బిజినెస్’ అయితేనే ఉత్తమం అనిపించింది. అనేక వ్యవసాయ క్షేత్రాలు తిరిగాం. సక్సెస్ స్టోరీలు, ఫెయిల్యూర్ స్టోరీలు విన్నాం. చివరికి ‘పాడి పరిశ్రమ’ పెట్టాలని నిర్ణయించుకున్నాం. మనకు ఎన్ని రకాల వంటకాలు ఉన్నా పాలు, పాల పదార్థాలు తప్పనిసరి. కాబట్టి స్వచ్ఛమైన పాల ఉత్పత్తుల తయారీని మా వ్యాపారంగా ఎంచుకున్నాం. ఉత్పత్తి నుంచి పంపిణీ వరకూ అన్నీ మా అధీనంలోనే ఉండేలా ప్రణాళిక సిద్ధం
చేసుకున్నాం.
–దాయి శ్రీశైలం