జూబ్లీహిల్స్/అమీర్పేట జోన్ బృందం, ఫిబ్రవరి17: పేదల కోసం పరితపించిన ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పేదల స్థితిగతులు పూర్తిగా మారిపోవడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలతో, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో, అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ బంగారు తెలంగాణ సాధకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గురువారం వెంగళరావునగర్ డివిజన్లోని మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాంగణంలో కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, దేదీప్య విజయ్లతో కలిసి మొక్కలు నాటి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ హోమ్ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేక్ కట్చేసి, మిఠాయిలు పంచుకుని సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో వెంగళరావునగర్ డివిజన్ అధ్యక్షుడు కోనేరు అజయ్, వేణుగోపాల్ యాదవ్, శ్యామ్రావు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.