వరంగల్, డిసెంబర్ 26 (నమస్తేతెలంగాణ) : ఈ నెల 28న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించినట్లు జడ్పీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ఈ మేరకు సమావేశానికి హాజరుకావాలని కోరుతూ జడ్పీటీసీలకు సమావేశం అజెండా అంశాలతో సమాచారం పంపినట్లు తెలిపారు.
వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, పశు సంవర్థక, మత్స్య, సహకార, మార్కెటింగ్ శాఖలు చేపట్టిన పనుల ప్రగతి, ప్రజా పంపిణీ వ్యవస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఇందిరాక్రాంతి పథం, ఉపాధి హామీ పథకం, ఆరోగ్యం, పారిశుధ్యం, దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా సివిల్ హాస్పిటల్స్, కుటుంబ సంక్షేమ పథకాలు, ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, రాజీవ్ విద్యామిషన్ కార్యక్రమాల ప్రగతి, గ్రామ పంచాయతీల పన్నుల వసూళ్ల పనులు, హరితహారం, సామాజిక అడవుల అభివృద్ధి, జీవ వైవిధ్యం, తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ, నీటి పారుదల ప్రాజెక్టులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం, విద్యుత్ సరఫరా, ఆర్అండ్బీ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, మహిళ, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం, వెనుకబడిన తరగతులు సంక్షేమం, జిల్లా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి, జిల్లా పరిశ్రమలు, యువజన సర్వీసులు, చేనేత, జౌళి శాఖ కార్యక్రమాలు తదితర శాఖలు, సంస్థల కార్యక్రమాల ప్రగతిపై సమావేశంలో చర్చ జరుగనుందని వెల్లడించారు.