ఖిలావరంగల్, నవంబర్ 25: చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో వారం రోజులుగా కొనసాగుతున్న ప్రపంచ వారసత్వ వారోత్సవాలు శుక్రవారం రాత్రి ముగిశాయి. కళాకారుల ఆటపాటలు, కోలాటం, లంబాడా, జానపద నృత్యాలతో కీర్తి తోరణాల ప్రాంగణం మార్మోగింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన శివతాండవం, పలుకే బంగారమాయేనా, అయిగిరి నందిని శాస్త్రీయ పాటలకు కూచిపూడి, పేరిణి న్యృతాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఈ ముగింపు ఉత్సవాలను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య, రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, డీటీవో శివాజీ, కేంద్ర పురావస్తు శాఖ సీఏ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మన ప్రాంత చరిత్ర మనకు తెలిసి ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన వారసత్వ సంపదను కాపాడుతూ భావితరాలకు అందించే బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. ఘన కీర్తిని కలిగిన కోటను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ మాట్లాడుతూ అద్భుతమైన కాకతీయ చక్రవర్తుల నిర్మాణాల విశిష్టతను కాపాడాలన్నారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో మొదటిసారిగా రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం సంతోషయదాకమన్నారు. విద్యార్థులందరూ ఇక్కడి ఆలయాల చరిత్రను తెలుసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు గొప్పగా చెప్పుకోవాలన్నారు. అనంతరం వారం రోజులపాటు నిర్వహించిన వ్యాస రచన, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు. అలాగే కళాకారులకు జ్ఞాపికలు అందించి శాలువాలతో సత్కరించారు.