నర్సంపేట, జూన్ 8 : నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా టాస్క్ఫోర్స్ అధికారి సీఐ మధు అన్నారు. మంగళవారం నర్సంపేటలో టాస్క్ఫోర్స్ అధికారుల బృందం విస్తృతంగా పర్యటించి విత్తనాలు, ఎరువుల షాపులను తనిఖీ చేసిం ది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రైతులు కొనుగోలు చేసిన వస్తువుకు దుకాణదారులు రసీదులు ఇవ్వాలని ఆదేశించారు. అధీకృత డీలర్ల వద్ద మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. షాపుల యజమానులు తప్పనిసరిగా రికార్డులు నిర్వహించాలన్నారు. షాపులకు లైసెన్స్ కలిగి ఉండాలని, స్టాక్ పాయింట్స్ వివరాలను తప్పనిసరిగా రికార్డుల్లో నమోదు చేయాలని మధు కోరారు. బిల్ బుక్స్, గోదాముల్లో నిల్వలను పేర్కొనాలని సూచించారు. అనంతరం గోదాముల్లో స్టాక్స్ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట డివిజన్ టాస్క్ఫోర్స్ అధికారి టీ శ్రీనివాస్రావు, మండల వ్యవసాయ విస్తరణ అధికారి టీ కృష్ణకుమార్, ఎస్సై నవీన్కుమార్, ఏఈవో ఎం అశోక్ పాల్గొన్నారు.
నెక్కొండలో మూడు షాపులకు షోకాజ్ నోటీసులు
నెక్కొండ : నెక్కొండలోని ఫర్టిలైజర్ షాపులను జిల్లా టాస్క్ఫోర్స్ టీమ్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. నర్సంపేట ఏడీఏ తోట శ్రీనివాస్రావు, సీఐ మధు, ఎస్సై నాగరాజు, వ్యవసాయాధికారి అడిదెల సంపత్రెడ్డి ఫర్టిలైజర్స్ షాపుల్లో డీలర్ల లైసెన్స్లు, స్టాక్ రిజిస్టర్లు, అప్డేట్ చేస్తున్నారా లేదా వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ సీఐ మధు, ఏడీఏ తోట శ్రీనివాసరావు మాట్లాడుతూ షాపుల్లో విడి పత్తి విత్తనాలను, ప్రభుత్వ ఆమోదంలేని సీడ్స్ను విక్రయించొద్దని సూచించారు. ఎవరైనా ప్రభుత్వ ఆమోదం లేని విత్తనాలను అమ్మితే వ్యవసాయాధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తనిఖీల్లో రోజువారీ విత్తనాల అమ్మకం, నిల్వల్లో వ్యత్యాసం ఉండడంతో ‘మన గ్రోమోర్ కేంద్రం’కు స్టాక్ బోర్డులను అప్డేట్ చేయనందుకు ‘విజయ్ ఏజెన్సీస్’ గోపీకృష్ణ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంబంధిత షాపులపై విత్తన చట్ట ప్రకారం చర్యలకు సిఫారసు చేయనున్నట్లు వారు తెలిపారు. తనిఖీల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు వినేకర్, అరుణ్కుమార్ పాల్గొన్నారు.
రైతులను మోసం చేస్తే కేసుల నమోదు : ఏసీపీ
వర్ధన్నపేట : రైతులను మోసంచేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే డీలర్లపై కేసులు నమోదు చేస్తామనిని వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని విత్తనాల విక్రయ దుకాణాలను సీఐ విశ్వేశ్వర్, ఎస్సై వంశీకృష్ణ, ఏవో రాంనర్సయ్యతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. ఏసీపీ మాట్లాడుతూ రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రసీదులు పొందాలని సూచించారు. గుర్తింపు పొందిన కంపెనీలకు సంబంధించిన విత్తనాలే తీసుకోవాలన్నారు. వ్యాపారులు విధిగా వారివద్ద ఉన్న స్టాకు వివరాలను బోర్డులపై రాయాలని ఆయన కోరారు.