హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 23 : దేశంలోనే వరంగల్ నిట్కు మంచి గుర్తింపు ఉంది. కొందరు విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు వచ్చినా కాదనుకొని ఇక్కడ సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్, ఎంఎం ఈ, బయోటెక్నాలజీ బ్రాంచ్లను ఏరికోరి ఎంపిక చేసుకుంటారు. ఇందులో సీటు వస్తే కొలువు ఖాయమని విద్యార్థులు భావిస్తున్నారు. ఏటా ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు పొందుతున్నవారి సంఖ్య పెరుగడం శుభపరిణామం. గత సంవత్సరం వెయ్యి మంది ఉద్యోగాలు పొందగా, అత్యధిక వార్షిక ప్యాకేజీ రూ. 62.5 లక్షలు. కాగా, ఈ ఏడాది రూ.88 లక్షల ప్యాకేజీతో విద్యార్థి ఆదిత్యసింగ్ ఉద్యోగం సాధించాడు.
వరంగల్ నిట్ చరిత్రలో రికార్డు..
వరంగల్ నిట్ చరిత్రలో ఇది ఓ రికార్డుగా పరిగణించవచ్చు. ఇదే విషయాన్ని వరంగల్ నిట్ కూడా ధ్రువీకరించింది. పలు ఐఐటీల్లో సత్తా ఉన్నవాళ్ల కోసం కంపెనీలు క్యూ కడుతుండగా వరంగల్ నిట్కు చెందిన కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఆదిత్యసింగ్కు భారీ ఆఫర్ ఇచ్చింది ఓ కంపెనీ. నిట్లో ఇదే అత్యధిక ప్యాకేజీ కావడం విశేషం. హైదరాబాద్ను కూడా దాటేశాడు అని చెప్పవచ్చు. ఐఐటీ హైదరాబాద్లో ఎలక్ట్రికల్ చదువుతున్న ఎంటెక్ విద్యార్థి రూ.63.8 లక్షల ప్యాకేజీతో రికార్డు సాధించగా దాన్ని వరంగల్ నిట్ ఆదిత్యసింగ్ దాటేశాడు. రూ.88 లక్షల ప్యాకేజీకి ఎంపికై రికార్డును తుడిచేశాడు.
1,340 మందికి ఉద్యోగాలు
వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో ఆకర్షణీయ వేతనాలతో కొలువులు సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. 2020-21లో రూ.55 లక్షలు, 2021-22లో రూ.66 లక్షలు, 2022-23లో రూ.88 లక్షలతో ప్యాకేజీ పెరుగుతోంది. ఇది నిట్ చరిత్రలో రికార్డు. మొత్తం 260 కంపెనీలు పాల్గొనగా 1,340 మంది ఉద్యోగాలు సాధించారు. ఇంకా ఎంపిక ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో వీరి సంఖ్య మరింత పెరుగనుంది. మరో 200 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించననున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం కంటే ఈసారి ఉద్యోగాలు కూడా అధిక సంఖ్యలో పెరిగాయి. అదేవిధంగా భారీ వేతనంతో కూడిన ప్యాకేజీని అందుకోవడం విశేషం.
ఆదిత్యసింగ్కు అత్యధిక ప్యాకేజీ
కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన ఆదిత్యసింగ్ రూ.88 లక్షల ప్యాకేజీ దక్కింది. ఉద్యోగాలకు అర్హులైనవారు సుమారు 1500 మందివరకు ఉండగా, వీరిలో కొందరు ఉన్నత చదువులకు ప్రాధాన్యం ఇస్తుండగా, మరికొందరు సొంత అంకుర సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది ఆర్థిక మాంద్యంతో పాత కంపెనీలు ఎంపిక కోసం రాకున్నా, నిట్ ప్లేస్మెంట్ విభాగం వారు కొత్త సంస్థలను ఆహ్వానించారు. విద్యార్థులు సైతం తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటున్నారు. మంచి వేతనాలు పొందేందుకు కావాల్సినవిధంగా ముందు నుంచే సిద్ధమవుతున్నారు. రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ క్లబ్ల ఏర్పాటుతో పాటు వేసవి సెలవుల్లో కళాశాలస్థాయిలో కోడింగ్ కాంపిటీషన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.
నాణ్యమైన బోధన, పరిశోధనతోనే
నిట్లో నాణ్యమైన బోధన, పరిశోధనపై దృష్టి పెట్టడం వలనే విద్యార్థులు కొలువులు సాధిస్తున్నారు. కొత్త విధానం, కెరీర్ డెలప్మెంట్, ప్రాక్టికల్స్, నూతన ఆవిష్కరణల ద్వారా ఉద్యోగాలు సాధించడంతో పాటు అత్యధిక వేతనం సాధ్యమైంది. ప్రతి సంవత్సరం ప్యాకేజీ పెరుగుతోంది. 2020-21లో రూ.55 లక్షలు, 2021-22లో రూ.66 లక్షలు, 2022-23లో రూ.88 లక్షలతో ప్యాకేజీ పెరుగడం చాలా సంతోషంగా ఉంది. ఇది నిట్ చరిత్రలో రికార్డు. మొత్తం 260 కంపెనీలు పాల్గొనగా 1,340 మంది ఉద్యోగాలు సాధించారు.
– వరంగల్ నిట్ డైరెక్టర్ ఆచార్య ఎన్వీ రమణారావు
భారీ ప్యాకేజీతో పెరుగుతున్న ఉద్యోగాలు..
నిట్లో కొత్త విధానం ద్వారా విద్యార్థులకు బోధన చేస్తున్నారు. విద్యార్థులను ఎంపిక చేసుకునేందుకు గత సంవత్సరం కంటే ఈసారి అధిక కంపెనీలు వచ్చాయి. భారీ వార్షిక ప్యాకేజీతో పాటు ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగింది. నిట్ సీటు వచ్చిందంటేనే విద్యార్థులకు మంచి తెలివితేటలు ఉంటాయి. ఉద్యోగాల్లో బాగా రాణిస్తారని, ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీలు కంపెనీలు ఇస్తుంటాయి. సుమారు 260 కంపెనీలు రాగా ఇప్పటివరకు 1340 మంది ఎంపికయ్యారు. ఇంకా 200 మంది ఎంపిక కానున్నారు.
– డాక్టర్ ఎంజే డేవిడ్సన్, సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్