వరంగల్చౌరస్తా, మార్చి 19: అకాల వర్షంతో నిరాశ్రయులైన వారికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ భరోసా కల్పించారు. నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. గిర్మాజీపేట, యాకుబ్పుర, చింతల్, పుప్పాలగుట్ట, ఆర్ఎస్నగర్, ఏసీరెడ్డినగర్లో శనివారం అర్ధరాత్రి వడగండ్ల వాన పడింది. దీంతో ఆర్ఎస్నగర్, ఏసీరెడ్డినగర్లో గుడిసెలు, పెంకుటిల్లు ధ్వంసమయ్యాయి. ఇంటి పైకప్పులు దెబ్బతినడంతో వర్షపు నీరంతా ఇండ్లలోకి చేరి నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి.
విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి. చెట్లకొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో చిమ్మచీకట్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్తో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కాలనీలను సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇళ్లు కూలి నిరాశ్రయులైన భట్టు కిషన్, కూనపు ప్రసాద్, ఇటుకల వీరస్వామి కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం అందించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ అన్నారు. ఎమ్మెల్యే వెంట మర్రి శ్రీనివాస్, బీఆర్ఎస్ 36వ డివిజన్ అధ్యక్షుడు వేల్పుగొండ యాకయ్య, నాయకులు ఉన్నారు.
ఖిలావరంగల్: వడగండ్ల వాన కోటలో బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పడమరకోట, మధ్యకోట, తూర్పుకోట, శివనగర్లో సుమారు 40 ఇండ్ల పైకప్పులు ఈదురుగాలులకు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో బాధితులు జాగారం చేశారు. నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు వర్షంలో తడిసి ముద్దయ్యాయి. మండలంలో వడగండ్ల వానకు మిర్చి, మక్కజొన్న పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆకు కూరలు, తీగజాతి కాయలు, టమాట, బెండకాయ తోటలు వర్షానికి కొట్టుకుపోయి ఇసుక మేటలతో ఎడారిని తలపించాయి. దీంతో అన్నదాతలు బరువెక్కిన గుండెలతో రోదిస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ద్విచక్ర వాహనంపై నియోజకవర్గంలో పర్యటించారు. కూలిన ఇండ్లను, ధ్వంసమైన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
బాధితులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అలాగే, అక్కడక్కడా రోడ్లపై పడిన చెట్లు, విరిగిన విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా పంట నష్టాలను అంచనా వేసి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రజలు, రైతులు ధైర్యంగా ఉండాలని, అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తానన్నారు. అలాగే, ఇండ్లు పూర్తిగా ధ్వంసమైన వారికి గృహలక్ష్మి పథకం కింద రూ. 3 లక్షలు అందచేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట ఖిలావరంగల్ తహసీల్దార్ ఫణికుమార్, ఏవో విజ్ఞాన్, 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్యాదవ్, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, బీఆర్ఎస్ నాయకులు బిల్లా శ్రీకాంత్, సిరబోయిన వాసు, అర్షం రాంబాబు, వనపర్తి కరుణాకర్, సిరబోయిన శ్రీనివాస్ ఉన్నారు.