సుబేదారి, డిసెంబర్ 13 : వృద్ధురాలి ఇంట్లో దోపిడీకి పాల్పడిన యువతితోపాటు మరో ఇద్దరు నిందితులను సీసీఎస్, మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. దోపిడీకి పాల్పడిన యువతి నుంచి రూ. 1.46 లక్షల నగదు, ఒక ద్విచక్రవాహనం, బురఖా, సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ చేసిన యువతితో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన ఇద్దరిని అరెస్టు చేసి, వారి నుంచి నుంచి 2.15 లక్షల నగదు, 60 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్టు వివరాలను అదనపు క్రైం డీసీపీ పుష్పారెడ్డి మంగళవారం వెల్లడించారు. నిందితురాలు వరంగల్ లేబర్కాలనీలో తల్లిదండ్రులతో నివాసం ఉంటున్నది. స్థానికంగా ఉన్న ఓ డిగ్రీ కళాశాలలో బీబీఎం చదువుతూ హనుమకొండలోని ఓ బ్యూటీపార్లర్లో పార్ట్టైం ఉద్యోగం చేస్తోందని తెలిపారు. నిందితురాలి తండ్రి మద్యానికి బానిస కావడంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని దోపిడీకి పాల్పడినట్లు చెప్పారు. ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధురాలి ఇంటికి కిరాయికి వెళ్లి దోపిడీకి ప్రణాళిక రూపొందించుకుందని పేర్కొన్నారు.
ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు బురఖా ధరించి వృద్ధురాలి వద్దకు వెళ్లి ఇంటి అద్దెకు కావాలని అడిగింది. ఇంట్లోకి వెళ్లి వెంట తెచ్చుకున్న కారంపొడిని వృద్ధురాలి కళ్లలో చల్లింది. మెడలో ఉన్న బంగారు గొలుసును దోపిడీ చేసి అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై పారిపోయిందని తెలిపారు. దోపిడీ సొమ్మును ఎల్లంబజార్కు చెందిన ప్రేమ్కుమార్, హనుమకొండ కుమార్పల్లికి చెందిన బెజ్జంకి సురేందర్కు విక్రయించింది. కొంత డబ్బు తీసుకుందని, మిగిలిన డబ్బు కోసం మళ్లీ వస్తానని వెళ్లిందని వెల్లడించారు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితురాలిని గుర్తించామని తెలిపారు. మంగళవారం ఉదయం నిందితురాలిని ఇంట్లో ఉండగా అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించిందని ఆమె వెల్లడించారు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబర్చిన అదనపు డీసీపీ పుష్పారెడ్డి, ఏసీపీ డేవిడ్రాజు, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రమేశ్కుమార్, శ్రీనివాసరావు, మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఏఏవో సల్మాన్, ఏఎస్సైలు శివకుమార్, ఆశాబీ, కానిస్టేబుళ్లు వంశీ, చంద్రశేఖర్, అంజయ్య, నగేశ్ను పోలీస్ కమిషనర్ అభినందించారు.