భూపాలపల్లి, నవంబర్ 30;గని కార్మికుల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కల నెరవేరబోతున్నది. సమైక్య పాలనలో సింగిల్ బెడ్రూం క్వార్టర్లలో చాలీచాలని వసతులతో పడిన అవస్థలకు ఇక కాలం చెల్లనున్నది. ఉద్యమనేతగా, ముఖ్యమంత్రిగా పలుమార్లు నల్లనేలలో పర్యటించి వారి కష్టాలను కళ్లారాజూసిన కేసీఆర్.. అన్ని హంగులతో వెయ్యి క్వార్టర్లు కట్టిస్తామనే హామీ కార్యరూపం దాల్చడమే గాక కళ్లెదుటే నిలువెత్తు సౌధమై కల సాకారం చేస్తున్నది. స్వరాష్ట్రంలో సింగరేణియులకు తొలిసారి డబుల్ బెడ్రూమ్ క్వార్టర్లు నిర్మిస్తుండగా భూపాలపల్లి ఏరియాలో రూ.166.22 కోట్లతో 944 ఇళ్లు కట్టిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 490 క్వార్టర్లు పూర్తికాగా, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. త్వరలో వీటిని ప్రారంభించేందుకు సింగరేణి అధికారులు సన్నాహాలు చేస్తుండగా సీఎం కేసీఆర్ చొరవ, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కృషి ఫలితంగా తమకు గృహయోగం పట్టిందని కార్మిక కుటుంబాలు సంతోషం వ్యక్తంచేస్తున్నాయి.
చీకటిసూర్యుల కష్టాలను దగ్గరగా చూసిన ఉద్యమనేత, సీఎం కేసీఆర్ అన్నీతానై అండగా నిలుస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గని కార్మికులకు స్వరాష్ర్టాన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపుతున్నారు. ఈ నేపథ్యంలో సమైక్యపాలనలో సింగిల్ బెడ్రూం క్వార్టర్లలో చాలీచాలని వసతులతో పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఉద్యమ సమయంలో, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నల్లనేలలో పలుమార్లు పర్యటించిన సందర్భాల్లో సంక్షేమ ఫలాలు అందించాల్సిందిగా సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా భూపాలపల్లికి వచ్చిన సీఎం కేసీఆర్, సింగరేణి కార్మికులకు వెయ్యి క్వార్టర్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే యాజమాన్యం సింగరేణిలోనే ప్రప్రథమంగా కార్మికుల కోసం సత్తుపల్లి, భూపాలపల్లి ఏరియాల్లో డబుల్బెడ్రూం క్వార్టర్ల నిర్మాణం చేపట్టింది. సత్తుపల్లిలో నిర్మాణం పూర్తయి కార్మిక కుటుంబాలు నివాసం ఉంటుండగా, భూపాలపల్లి ఏరియాలో 994 డబుల్ బెడ్రూమ్ క్వార్టర్ల నిర్మాణం మొదలుపెట్టింది.
ఎమ్మెల్యే, సీఎండీ చొరవతో..
భూపాలపల్లి ఏరియాలో యైటిైంక్లెయిన్(కేఎల్పీ) రోడ్లో డబుల్బెడ్రూం క్వార్టర్ల నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్వయంగా, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఆధ్వర్యంలో సింగరేణి డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, బలరాం పలుమార్లు క్వార్టర్ల నిర్మాణ పనులను పరిశీలించి, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో, జీఎంతో పాటు సంబంధిత ఏరియా స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూనే ఆదేశాలు జారీ చేశారు. కరోనా వేళ కొంతమేర పనులు మందగించినా మిగితా సమయంలో నిర్మాణ పనులను వేగంగా కొనసాగుతూనే ఉన్నాయి.
తీరనున్న కార్మిక కష్టాలు
సమైక్య రాష్ట్రంలో సింగిల్ బెడ్రూం క్వార్టర్లు మాత్రమే నిర్మించడం వల్ల వాటిలో వసతులు అరకొరగా ఉన్నా యి. కంపెనీ క్వార్టర్ లేని కార్మిక కుటుంబాలు అద్దె ఇండ్ల లో ఉంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. అధునాతన సౌకర్యాలతో కూడిన డబుల్బెడ్రూం క్వార్టర్లలో నివాసం ఉండబోతున్నారు. ఈ డబుల్ ఇళ్ల యోగం అతి త్వరలోనే భూపాలపల్లి ఏరియా సింగరేణి కార్మికులకు దక్కబోతున్నది.
నెరవేరిన సీఎం కేసీఆర్ హామీ
భవిష్యత్లో కొత్త గనులు వచ్చి భూపాలపల్లి ఏరియా సింగరేణికే తలమానికంగా మారనున్న దృష్ట్యా సింగరేణి కార్మికుల నివాసార్థం మరో వెయ్యి క్వార్టర్లు ఇక్కడ నిర్మిస్తామని గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు భూపాలపల్లి ఏరియాకు వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీ నెరవేరింది. ఇందులో భాగంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సీఎం కేసీఆర్ను, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ను పలు దఫాలుగా కలిసి క్వార్టర్ల నిర్మాణం చేపట్టడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ 994 క్వార్టర్లను మంజూరు చేసి, అందుకు అవసరమైన నిధులు కేటాయించాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ను ఆదేశించారు. ఈమేరకు క్వార్టర్ల నిర్మాణం కోసం రూ.166.22 కోట్లను యాజమాన్యం మంజూరు చేసింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న సదరు నిర్మాణ సంస్థ 2020 అక్టోబర్ 31 పనులను ప్రారంభించించిది. మొత్తం 71 బ్లాకులు, బ్లాక్ ఒక్కంటికి 14 క్వార్టర్లు ఉన్నాయి. ఇందులో 490 క్వార్టర్లు పూర్తికాగా, మిగతావి పురోగతిలో ఉన్నాయి.
నిర్మించి సింగరేణికి అప్పగించారు..
సింగరేణి సంస్థ భూపాలపల్లి ఏరియాలో చేపట్టిన 994 డబుల్బెడ్రూం క్వార్టర్లలో 490 క్వార్టర్ల(35 బ్లాకుల) నిర్మాణాన్ని పూర్తయ్యింది. ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో కేపీసీ నిర్మాణ సంస్థ సింగరేణికి అప్పగించింది. నిర్మాణం పూర్తయిన క్వార్టర్ల బ్లాకుల్లో మౌలిక వసతులైన తాగునీరు, శానిటరీ, విద్యుత్ పనులు కూడా పూర్తయ్యాయి. పూర్తయిన 490 క్వార్టర్లలో అన్ని వసతులను కల్పించారు. ఇవి ఉద్యోగులకు కేటాయించేందుకు అనువుగా ఉన్న విషయమై జీఎం శ్రీనివాసరావుకు నివేదించాను.
– సత్యనారాయణ డీజీఎం(సివిల్), భూపాలపల్లి ఏరియా
త్వరలోనే కేటాయిస్తాం..
నిర్మాణం పూర్తయిన 490 క్వార్టర్లను కేటాయించేందుకు సింగరేణి సంస్థ నిబంధనలకు లోబడి విధివిధానాలు రూపొందించాల్సి ఉంది. ఇందుకు గాను సింగరేణి గుర్తింపు, ఏరియా ప్రాతినిధ్య సంఘాల ప్రతినిధులతో చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే సింగరేణి ఉద్యోగులకు కేటాయిస్తాం. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రారంభోత్సవ తేదీ నిర్ణయం చేస్తాం. మిగితా క్వార్టర్ల నిర్మాణ పనులు వేగంగానే నడుస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో మిగితా క్వార్టర్లు అన్ని పూర్తవుతాయి.
– బళ్లారి శ్రీనివాసరావు, జీఎం, భూపాలపల్లి ఏరియా