వరంగల్ చౌరస్తా, నవంబర్ 30: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ప్రసూతి, గర్భస్థ వైద్య సేవలు అందిస్తున్న సీకేఎం దవాఖానలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ గోపి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన దవాఖానను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లోని ప్రతి వార్డులో కలియతిరిగారు. పారిశుధ్య చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మెరుగుపర్చాలని ఆదేశించారు. దవాఖానలో వైద్య సేవలు పొంది శిశువులకు టీకా వేయించేందుకు వచ్చిన మహిళలతో మాట్లాడి వైద్య సేవల తీరును తెలుసుకున్నారు. హాస్పిటల్లోని అన్ని వార్డుల్లో ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార మెనూ విధిగా అమలు చేయాలన్నారు. సీకేఎం హాస్పిటల్లో శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళల ఆరోగ్యస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అలాగే, బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశారు. అనంతరం దవాఖాన వెనుక భాగంలో ఉన్న స్థలాన్ని పరిశీలించారు. దోబీ (దుస్తుల శుద్ధి కేంద్రం)ని పరిశీలించి.. దుస్తుల వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. రక్తనిధి కేంద్రాన్ని పరిశీలించి అవసరానికి తగిన విధంగా వినియోగించుకోవాలని సూచించారు. రోగుల అటెండెంట్ల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను పరిశీలించి, అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అనంతరం వైద్యాధికారులు, విభాగాధిపతులతో సమీక్షించారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సాధారణ ప్రసవాల రేటును పెంచడానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా గర్భిణిలతో మాట్లాడి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని, సాధారణ ప్రసవాలపై వారిలో ఉన్న భయాన్ని తొలగించేందుకు అవగాహన కల్పించాలన్నారు. శానిటేషన్ పైపులైన్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా వైద్య సేవలను మెరుగుపర్చేందుకు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చుకోవాలన్నారు. ఆయన వెంట ఇన్చార్జి సూపరింటెండెంట్ పద్మ ఉన్నారు.
గర్భిణులకు శుభవార్త!
హనుమకొండచౌరస్తా: హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు ఉమ్మడి జిల్లా నుంచి గర్భిణులు వైద్య సేవల కోసం వస్తారు. ప్రతిరోజూ సుమారు 400 మందికి ఓపీ చూస్తారు. రోజుకు 15 నుంచి 20 వరకు ప్రసవాలు అవుతున్నాయి. వారానికి సుమారు వంద వరకు ప్రసవాలు అవుతున్నట్లు.. నెలకు 550 నుంచి 600 వరకు డెలివరీలు జరుగుతున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ సందరంగా ప్రభుత్వ ప్రసూతి దవాఖాన సూపరింటెండెంట్ విజయలక్ష్మి మాట్లాడుతూ హనుమకొండలోని ప్రసూతి దవాఖానలో ఇటీవల టిఫా స్కానింగ్ యంత్రం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇటీవల మంత్రి హరీశ్రావు ఆన్లైన్ ద్వారా అన్ని దవాఖానల్లో ప్రారంభించినట్లు వెల్లడించారు. దవాఖానలో ఉచితంగా టిఫా స్కానింగ్ చేయడం వల్ల పేద గర్భిణులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ముందుగానే శిశువు లోపాలు గుర్తించేందుకు టిఫా స్కానింగ్ చేయిస్తారని చెప్పారు. ఈ యంత్రం లేకపోవడంతో గతంలో గర్భిణులు ప్రైవేట్ దవాఖానల్లో స్కానింగ్ చేయించుకునేవారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం దవాఖానలో టిఫా స్కానింగ్ మిషన్ అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. దీంతో గర్భిణులు బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ దవాఖానలోనే టిఫా పరీక్షలు చేస్తున్నామని వివరించారు.