సుబేదారి, నవంబర్ 30: వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి బదిలీ అయ్యారు. కొత్త సీపీగా హైదారాబాద్ ట్రాఫిక్ విభాగంలో జాయింట్ పోలీసు కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ఏవీ రంగనాథ్ను నియమిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తరుణ్జోషిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. కొత్త సీపీగా నియమితులైన రంగనాథ్ 2004లో నర్సంపేట డిఎస్పీగా పనిచేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా, నల్లగొండ జిల్లాలో అమృత-ప్రణయ్ కేసులో కీలకంగా పనిచేశారు. నర్సంపేటలో డీఎస్పీగా పనిచేసినప్పుడు నక్సల్స్ సమస్య పరిష్కారానికి కృషిచేశారు. రంగనాథ్ పుట్టింది నల్లగొండ జిల్లాలో అయినా ఆయన బాల్యం మాత్రం హైదరాబాద్లోనే గడిచింది.
తరుణ్జోషి తనదైన ముద్ర
వరంగల్ పోలీసు కమిషనరేట్ ఏర్పాటు అనంతరం నాలుగో పోలీసు కమిషనర్గా డాక్టర్ తరుణ్జోషి విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారు. 2021 ఏప్రిల్ 7న బాధ్యతలు చేపట్టి 19 నెలలు విధులు నిర్వర్తించారు. శాంతిభద్రతల విషయంలో రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కమిషనరేట్ పరిధిలో గంజాయి, డ్రగ్స్ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ విభాగానికి పదునుపెట్టారు. చిట్ఫండ్ సంస్థల యజమానుల ఆగడాలను వెలుగులోకి తీసుకొచ్చి వారి మోసాలకు అడ్డుకట్ట వేసి నిందితులను అరెస్ట్ చేశారు. దోపిడీ దొంగల ముఠాలకు చెక్పెట్టారు. ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా అమలు చేయడానికి చర్యలు తీసుకున్నారు. సైబర్ నేరాలపట్ల ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఆవినీతి ఆరోపణలు వచ్చిన పోలీసు అధికారులను సస్పెండ్ చేసి లాఅండ్ ఆర్డర్ను చక్కబెట్టారు. మత్తుపదార్థాలకు బానిసైన యువతలో మార్పు తీసుకొచ్చేందుకు ‘నయా కిరణ్’కు శ్రీకారం చుట్టారు. పోలీసు గ్రీవెన్స్సెల్కు ప్రాధాన్యత ఇస్తూ బాధితుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు కృషి చేశారు.