వరంగల్చౌరస్తా/కాశీబుగ్గ, అక్టోబర్ 1: సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలను పురస్కరించుకొని వరంగల్ నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆట స్థలాల్లో చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేస్తున్నారు. అలాగే, ఉత్సవ కమిటీలు, గ్రేటర్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ ఉర్సు రంగలీల మైదానంలో సద్దుల బతుకమ్మ, దసరా ఏర్పాట్లను వరంగల్ ఆర్డీవో మహేందర్జీ, తహసీల్దార్ ఫణికుమార్ శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపురి సంజయ్బాబు ఏర్పాట్లపై అధికారులకు వివరించారు. కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, ట్రస్ట్ చైర్మన్ వంగరి కోటేశ్వర్, కార్యనిర్వాహణ కార్యదర్శులు గోనె రాంప్రసాద్, పొగాకు సందీప్, సభ్యులు బజ్జూరి వాసు, పూజరి అజయ్, బత్తిని అఖిల్, నాగపురి అశోక్, పొగాకు చిరంజీవి, నాగపురి సంతోష్, పార్వతి కృష్ణంరాజు, బైరబోని మనోహర్ పాల్గొన్నారు. అలాగే, కాశీబుగ్గ 20వ డివిజన్ పద్మనగర్ ప్రాంతంలోని చిన్నవడ్డేపల్లి చెరువు సమీపంలో దసరా ఉత్సవ కమిటీ విజ్ఞప్తి మేరకు బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం పిచ్చిమొక్కలను తొలగించి మొరం పోయించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
నర్సంపేట/నర్సంపేటరూరల్/నల్లబెల్లి: నర్సంపేటలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో నిర్మిస్తున్న రోడ్లు, కల్వర్టుల పనులను మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ పరిశీలించారు. అంగడి మైదానంలో జరిగే దసరా, బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అంగడి సెంట ర్, సర్వాపురం, ద్వారకపేట, వల్లబ్నగర్, కమలాపురంలో బతుకమ్మ వేడుకలు జరుగుతాయని తెలిపారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ వెం కటస్వామి, కౌన్సిలర్లు ఉన్నారు. నర్సంపేట మండలం గురిజాల, లక్నేపల్లి, ముగ్దుంపురం, రామవరం, మహేశ్వరం, ఇటుకాలపల్లి, ముత్తోజిపేటలో జీపీ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. నల్లబెల్లి మండలవ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీవో కూచన ప్రకాశ్ తెలిపారు. మండలకేంద్రంలోని పెద్ద చెరువు వద్ద జరుగుతున్న సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎంపీవో వెంట కార్యదర్శి ధర్మేందర్, మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నారు.