వరంగల్ చౌరస్తా, మే 25: బాలకార్మిక వ్యవస్థను పూర్తిస్థాయిలో నివారించేందుకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలని డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ పిలుపునిచ్చారు. వరంగల్ 36వ డివిజన్లో బాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రతి ఒక్క రూ ముందుకొచ్చి పిల్లల భవిష్యత్కు బంగారుబాటలు వేసేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
అదేవిధంగా బాల్యవివాహాలు నేరమన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 100, 1098 టోల్ఫ్రీ నంబర్లపై పిల్లలు, పెద్దలకు అవగాహన కల్పించాలన్నారు. పిల్లల అక్రమ రవాణా, బాల్యవివాహాలు, పిల్లలను బాలకార్మికులుగా మార్చుతున్న వారిపై అధికారులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. చెప్పిన వారి పేర్లను గోప్యం గా ఉంచుతామని తెలిపారు. సూపర్వైజర్ బత్తిని రమాదేవి, పీవో సరితారాజు, కమిటీ పరిరక్షణ సభ్యులు రత్నం, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
నెక్కొండ: గుండ్రపల్లిలో చైల్డ్లైన్ జిల్లా కమిటీ సభ్యుడు రమేశ్ ఆధ్వర్యంలో బుధవారం ఓపెన్హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోంపెల్లి రాజేశ్వర్రావు మాట్లాడుతూ 18 ఏళ్లలోపు పిల్లలందరినీ బాలకార్మికులుగానే పరిగణిస్తారన్నారు. బాలకార్మిక నిరోధక చట్టం 1986 ప్రకారం ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నారు. చిన్నారులు చైల్డ్లైన్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
రమేశ్ మాట్లాడుతూ ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, పిల్లలు బడిలో, పెద్దలు పనిలో ఉండాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అచ్చాయమ్మ, కార్యదర్శి రవికుమార్, చైల్డ్లైన్ జిల్లా సభ్యుడు హరీశ్, మహేశ్, వీవో శోభారాణి, సుభాషిణి, అరుణ, భూలక్ష్మి, ఆశ వర్కర్ సమత, కిశోర పాల్గొన్నారు.