తమ్ముని బిడ్డ పెండ్లికి సామాన్లు కొందామని అన్న, వదిన, అక్క, బావ, కోడలు, మరికొందరు బంధువులు కలిసి ట్రాక్టర్లో సంబురంగా బయలు దేరారు. ఏమేం బట్టలు కొనాలో.. ఏయే వస్తువులు కావాలో ముచ్చటించుకుంటూ నర్సంపేట బాటపట్టారు. ఇల్లుదాటి ఐదు నిమిషాలు కూడా కాకముందే చెరువుకట్టపై కాచుకున్న మృత్యువు వారి ఆనందాన్ని ఆవిరి చేసింది. మరో వారంలో పెళ్లి జరుగాల్సిన ఇంట్లో పెను విషాదం నింపింది. ఖానాపురం మండలం అశోక్నగర్ శివారు దూసముద్రం చెరువుకట్టపై బుధవారం ట్రాక్టర్ బోల్తాపడి అక్కడికక్కడే ముగ్గురు, దవాఖానలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా దగ్గరి బంధువులే కావడం.. ఒకే ఊరివారు కావడంతో పర్శ్యతండా శోకసంద్రంలో మునిగిపోగా, ఉమ్మడి జిల్లా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
ఖానాపురం, మే 18 : వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో పెను విషాదం నిండింది. పెళ్లి సామాను కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా దగ్గరి బంధువులు. ఇంటి నుంచి బయల్దేరిన ఐదు నిమిషాల్లోనే ఈ దుర్ఘటన జరగడం, ఒకే ఊరికి చెందిన ఐదుగురు చనిపోవడం స్థానికులను తీవ్ర దిగ్భాంతికి గురిచేసింది.
బాధిత కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురం మండలం చిలుకమ్మతండా పంచాయతీ పరిధిలోని పర్శ్యతండాకు చెందిన గుగులోత్ ధన్సింగ్ చిన్న కూతురు వివాహం ఈ నెల 24న జరిపేందుకు నిశ్చయమైంది. పెళ్లికి కావాల్సిన సామగ్రిని కొనేందుకు 10 మంది బంధువులు ట్రాక్టర్లో బుధవారం మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో నర్సంపేటకు బయల్దేరారు.
ఐదు నిమిషాల్లోనే వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అశోక్నగర్ శివారు దూసముద్రం చెరువుకట్టపైకి చేరుకోగానే అడ్డుగా ఉన్న తుమ్మచెట్టును తప్పించబోయే క్రమంలో పల్టీలు కొడుతూ కట్టకింద పడిపోయింది. ఈ ప్రమాదంలో పర్శ్యతండాకు చెందిన గుగులోత్ స్వామి (48), గుగులోత్ సీత (26), జాటోత్ బుచ్చమ్మ (62) అక్కడికక్కడే చనిపోయారు. జాటోత్ గోవిందు, గుగులోత్ శాంతి, ధన్సింగ్ తీవ్రంగా గాయపడ్డారు.
విజయ, మమత, వనజ, అశోక్కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలియగానే స్థానికులు, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, ఉపేందర్రెడ్డి, నర్సంపేట ఏసీపీ సంపత్రావు, సీఐ, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇక్కడ పరిస్థితి విషమించి జాటోత్ గోవిందు (65), గుగులోత్ శాంతి (40) మృత్యువాతపడ్డారు.
ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయినవారంతా దగ్గరి బంధువులు, ఒకేఊరివాళ్లు. గుగులోత్ స్వామి, శాంతి భార్యభర్తలు కాగా వీరు ధన్సింగ్కు అన్నా వదినలు. జాటోత్ గోవిందు, బిచ్చమ్మ భార్యభర్తలు కాగా వీరు ధన్సింగ్కు అక్కాబావ. గుగులోత్ సీత ధన్సింగ్ మేనకోడలు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వా రు కావడం, ఒకే ఊరివారు కావడంతో స్థానికంగా తీ వ్ర విషాదం నెలకొంది. గుగులోత్ స్వామి, శాంతి దం పతులకు ఇద్దరు కొడుకులు కాగా, జాటోత్ గోవిందు, బిచ్చమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు ఉన్నారు. గుగులోత్ సీతకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.
ఒకే కుటుంబానికి, ఒకే ఊరికి చెందిన ఐదుగురు చనిపోవడంతో పర్శ్యతండాలో తీరని విషాదం అలుముకుంది. అప్పటివరకు తండావాసులతో కలిసి మెలి సి ఉన్న వారు ఇక లేరని తెలిసి తండావాసులు కన్నీటిసంద్రంలో మునిగిపోయారు.
ఆదుకుంటాం : ఎమ్మెల్యే పెద్ది
ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలను, గాయపడినవారిని టీఆర్ఎస్ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి భరోసా ఇచ్చారు. నర్సంపేట మార్చురీ వద్దకు వచ్చి మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఘటనను మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకెళ్లి సత్వరమే బాధిత కుటుంబాలకు సాయం అందేలా చూస్తామన్నారు. ఆయన వెంట ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షురాలు మహాలక్ష్మి- వెంకటనర్సయ్య ఉన్నారు.
పర్శ్యతండాకు చెందిన ఐదుగురు చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని, ఈ ఘటన చాలా దురదృష్టకరమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన విషయం తెలిసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు, పోలీస్లు, అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు