న్యూశాయంపేట, ఆగష్టు 17 : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న జానపద విజ్ఞాన అధ్యయనంలో ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ బాచుపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయంలో ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు ఉత్తర్వులు అందజేసి వెంకన్నను అభినందించారు. డాక్టర్ గడ్డం వెంకన్న గత 30 ఏళ్లుగా జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. 30 ఏళ్ల పరిశోధన, 15 ఏళ్ల బోధన అనుభవం ఉంది. పటం కథలు – కథకులు’ అనే అంశంపై పరిశోధన చేసి గ్రంథాన్ని వెలువరించారు.
జానపద గిరిజన విజ్ఞాన బహుముఖంశాలపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలలో పర్యటించి 30 కి పైగా పుస్తక రచనలు చేశారు. వివిధ జాతీయ స్థాయి సెమినార్లలో పాల్గొని 50 వరకు పత్ర సమర్పణ చేశారు. జానపద గిరిజన విజ్ఞానపీఠంలో డాక్టర్ వెంకన్న పర్యవేక్షణలో ఆరుగురు పిహెచ్ డి, ముగ్గురు ఎంఫిల్ విద్యార్థులు పరిశోధన పూర్తి చేసి డిగ్రీలు పొందారు. జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో చేపట్టిన పలు ప్రాజెక్టుల్లో భాగంగా వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, విశాఖపట్నం, తూర్పుగోదావరి, చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించి జానపద గిరిజన విజ్ఞాన బహుముఖంశాల సేకరణలో తన వంతు సహాయ సహకారాలు అందించారు.
ఈ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, తెలంగాణ తెలుగు అకాడమీ డైరెక్టర్ ఆచార్య భట్టు రమేష్ లకు వెంకన్న కృతజ్ఞతలు తెలిపారు. జానపద గిరిజన విజ్ఞాన పీఠం బోధన, బోధనేతర, నాలుగో తరగతి సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకులు వెంకన్నను అభినందించారు.