హనుమకొండ చౌరస్తా, జూలై 20 : హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్అండ్ సైన్స్కళాశాల (అటానమస్) బి.ఏ. జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బి.ఓ.ఎస్.) సమావేశం సోమవారం జర్నలిజం విభాగాధిపతి రక్కిరెడ్డి ఆదిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ రాష్ర్ట ఉన్నత విద్యామండలి రూపొందించిన బి.ఏ. జర్నలిజం మూడవ, నాలుగవ సెమిస్టర్ల పాఠ్యప్రణాళికపై సభ్యులు సమగ్రంగా చర్చించారు.
విద్యార్థులకు సమకాలీన జర్నలిజం, ప్రసార మాద్యమాలు, డిజిటల్ మీడియా, సమాచార సాంకేతికతకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించేవిధంగా రూపొందించిన పాఠ్యప్రణాళికను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ సతీష్, తెలంగాణ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగ అధ్యాపకులు సత్య, బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగ అధ్యాపకులు యాదగిరి తమ ఆమోదం ద్వారా బాహ్యనిపుణులుగా హాజరై తమ సూచనలు, సలహాలను అందించారు. అలాగే జర్నలిజం ప్రతినిధిగా పి.శివకుమార్, కళాశాల పూర్వ విద్యార్థుల ప్రతినిధిగా పుల్ల సుధాకర్ పాల్గొని పాఠ్యప్రణాళిక రూపకల్పనకు విలువైన సూచనలు చేశారు. ఈ సమావేశంలో హరికుమార్, పుల్ల రమేష్, మాధవి, ఐలేష్ పాల్గొన్నారు.