యువకుడి ఆయువు తీసిన అగ్నిపథ్
సికింద్రాబాద్లో జరిగిన పథకం వ్యతిరేక ఆందోళనల్లో దబీర్పేటవాసి మృతి
పోలీసుల కాల్పుల్లో ప్రాణాలొదిలిన రాకేశ్
కేంద్రం తీరుపై నిరసన తెలిపేందుకు వెళ్లి బలి
అక్క స్ఫూర్తితో జవాను కావాలనుకొని అంతలోనే అనంతలోకాలకు
కేంద్రం నిర్ణయంతో ‘ఆర్మీ’ ఆశలు ఆవిరై విషాదాంతం
పెద్దదిక్కును కోల్పోయి గుండె పగిలిన కుటుంబం
రాకేశ్ మృతికి కేంద్రమే బాధ్యత వహించాలి : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
బాధిత కుటుంబసభ్యులకు ఓదార్పు
నేడు నర్సంపేట బంద్కు పిలుపు
తన అక్క స్ఫూర్తితో ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని అతడు కన్న కలలు కల్లలయ్యాయి. సైనికుడు కావడమే లక్ష్యంగా అతడు పడ్డ కఠోర శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఎలాగైనా జవాను కావాలన్న పట్టుదలతో రెండుసార్లు ‘రిక్రూట్మెంట్’కు హాజరై త్రుటిలో అవకాశం చేజార్చుకొని.. మళ్లీ ప్రయత్నించి ఫిజికల్ టెస్టులన్నీ పాసై ఎంపిక కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకం అతడి ఆశలను ఆవిరి చేసింది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం జరిగిన ఆందోళనల్లో ఖానాపురం మండలం దబీర్పేటకు చెందిన దామెర రాకేశ్ (21) పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెద్దదిక్కుగా నిలిచి తమ కష్టాలు తీర్చుతాడనుకున్న కొడుకు కేంద్ర సర్కారు తీరుకు బలైపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తుండగా, ఆర్మీ జవానై తమ ఊరికి గర్వకారణంగా నిలుస్తాడనుకున్నవాడు ఇక లేడని తెలిసి గ్రామమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఖానాపురం, జూన్ 17: ఎలాగైనా ఆర్మీ జవాను కావాలని కఠోర శిక్షణ తీసుకున్నాడు. ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగులు పెడుతూ దేహదారుఢ్యాన్ని పెంపొందించుకున్నాడు. రెండు సార్లు త్రుటిలో చేజార్చుకొని పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ శారీరక పరీక్షల్లో నెగ్గాడు. రాత పరీక్ష కోసం సిద్ధమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా తెచ్చిన అగ్నిపథ్ పథకం అతడి పాలిట అశనిపాతమైంది. అగ్నిపథ్కు వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం జరిగిన ఆందోళనల్లో ఖానాపురం మండలం దబీర్పేటకు చెందిన దామెర రాకేశ్ (21) పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెద్దదిక్కును కోల్పోయి అతడి కుటుంబం గుండెలవిసేలా రోదిస్తుండగా ఊరుఊరంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన దబీర్పేటకు చెందిన దామెర కుమారస్వామి, పూలమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. వీరిది వ్యవసాయ నేపథ్యం, పెద్ద కొడుకు రాంరాజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు కోల్పోయాడు. కూతురు ఉషారాణి గృహిణి కాగా, మరో కూతురు రాణి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో బీఎస్ఎఫ్లో జవానుగా విధులు నిర్వహిస్తున్నది. తమను పోషించేందుకు, ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేసేందుకు తల్లిదండ్రులు పడ్డ కష్టాలను చిన్ననాటి నుంచి చూసిన రాకేశ్ ఏనాటికైనా కుటుంబానికి పెద్దదిక్కుగా నిలవాలనుకున్నాడు. ఆర్మీలో జవాను అయిన అక్క రాణిని స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా సైనికుడు కావాలని ఇష్టం పెంచుకున్నాడు. పదో తరగతి వరకు గ్రామంలో, ఇంటర్ నర్సంపేటలో, డిగ్రీ హనుమకొండలో పూర్తి చేశాడు. ఫైనలియర్ చదువుతూనే ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో రెండేళ్లుగా శిక్షణ తీసుకున్నాడు. గతంలో రెండు పర్యాయాలు ఆర్మీ జవాను ఉద్యోగం త్రుటిలో తప్పిపోయింది. ఈసారి ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో హకీంపేటలో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని బీఎస్ఎఫ్ జవాను ఉద్యోగానికి ఇటీవలే ఈవెంట్స్ పూర్తిచేశాడు. రాత పరీక్ష జరగాల్సి ఉండగా వాయిదా పడింది.
దీంతో రిటర్న్ టెస్ట్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో మరో నలుగురు మిత్రులతో కలిసి హనుమకొండలో ఉంటూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉచిత శిక్షణ తీసుకుంటూ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సైనిక నియామకాల కోసం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ పథకంతో తమకు తీరని అన్యాయం జరుగుతుందని భావించాడు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో తోటి మిత్రులతో కలిసి పాల్గొన్నాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో అనుకోకుండా ప్రాణాలు వదిలాడు.
నా కొడుకు ఎన్నో కలలు కన్నడు
ఆర్మీ జవాను ఉద్యోగం కోసం నా కొడుకు ఎన్నో కలలు కన్నడు.. ఆ కల, కష్టం నెరవేరకుండానే చనిపోయిండు. రెండేళ్ల నుంచి రాత పరీక్ష నిర్వహించకుండా కాలయాపన చేసి చట్టాలను మార్చి కేంద్ర ప్రభుత్వమే ఈ రోజు నా కొడుకును బలితీసుకున్నది. నిరుద్యోగుల జీవితాలతో కేంద్రంలోని బీజేపీ సర్కారు చెలగాటమాడుతున్నది. నా కొడుకును వ్యవసాయం చేసుకొనైనా సాదుకునేటోన్ని. నా ఈ బాధ మరెవ్వరికీ రావద్దు. కేంద్రం ఆర్మీ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలె.
– కుమారస్వామి, రాకేశ్ తండ్రి
యువకుల ఆశలపై ‘అగ్ని’
10 లక్షల మంది యువకులను ఆర్మీ ఉద్యోగాలకు ఎంపిక చేసి వారిలో 75శాతం మంది యువకులను నాలుగేండ్ల సర్వీసు తర్వాత తొలగించి కేవలం ప్రతిభ ఆధారంగా 25 శాతం మందిని రెగ్యులరైజ్ చేయడం అగ్నిపథ్ ఉద్దేశం కాగా, ఇదే రాకేశ్ ప్రాణాలమీదికి తెచ్చింది. రాకేశ్ గతంలోనే ఈవెంట్స్ పూర్తి చేసి రాత పరీక్షకు సిద్ధంగా ఉన్న క్రమంలో సాధారణంగా ఎంపికైతే పర్మినెంట్ ఉద్యోగిగా ఉండేవాడు. కానీ, కేంద్రం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను అగ్నిపథ్ పథకంలో కలిపివేడయంతో గత నోటిఫికేషన్లో ఈవెంట్స్ పూర్తిచేసిన యువకులంతా శుక్రవారం సికింద్రాబాద్లో జరిగిన అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనకు తరలివెళ్లారు. రాకేశ్ తనతోపాటు ఈవెంట్స్ పూర్తిచేసిన వరంగల్ జిల్లాకు చెందిన 15 మంది మిత్రలతో కలిసి వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. వారంతా వారం క్రితమే సికింద్రాబాద్లో ఆందోళనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే గురువారం రాత్రి రాకేశ్ మిత్రులతో కలిసి సికింద్రాబాద్ వెళ్లాడు.
దబీర్పేటలో విషాదం..
దబీర్పేటలో రోదిస్తున్న రాకేశ్ నానమ్మ చిలుకమ్మ
పోలీసుల కాల్పుల్లో రాకేశ్ చనిపోవడంతో అతడి స్వగ్రామం దబీర్పేటలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ నెల 9న గ్రామంలో తన మిత్రుడి చెల్లెలి వివాహం కోసం వచ్చివెళ్లిన రాకేశ్ అంతలోనే చనిపోయాడని తెలిసి గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. అతడి మృతి వార్త తెలియగానే తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించారు. ఏడ్చిఏడ్చి రాకేశ్ తల్లి పూలమ్మ సొమ్మసిల్లిపడిపోయింది. నానమ్మ చిలుకమ్మ రోదించిన తీరు ప్రతి ఒక్కరికీ కంటతడి పెట్టించింది. రాకేశ్ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి వరకు స్వగ్రామానికి బందోబస్తు నడుమ తీసుకొచ్చారు.