పోచమ్మమైదాన్/కాశీబుగ్గ, మే 8: వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పేదింటి బిడ్డ మారెపల్లి సుధీర్కుమార్ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కోరారు. బుధవారం రాత్రి వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం కాలేజీ వద్ద, కాశీబుగ్గ జంక్షన్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటు వేసి సుధీర్కుమార్ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కావ్య తండ్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం పదవులు అనుభవించారని గుర్తుచేశారు. నేడు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్న కడియంకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. అలాగే, అరూరి రమేశ్ పదేళ్లు బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఉండి, ఇప్పుడు స్వార్థంతో బీజేపీలో చేరి మోసం చేశారని విమర్శించారు. ఎంపీగా సుధీర్కుమార్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై పోరాటం చేసి, ప్రజలకు పథకాలు అందేలా చేస్తామని హామీ ఇచ్చా రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటిందని, కల్యాణలక్ష్మి, తులం బంగారం, మహిళలకు రూ. 2,500 ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇకనైనా ప్రజలు ఆలోచించి, బీఆర్ఎస్ అభ్యర్థికి పట్టం కట్టాలని కోరారు. సమావేశంలో అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్, నాయకులు ఎండీ మసూద్, మావురపు విజయభాస్కర్రెడ్డి, అచ్చ విద్యాసాగర్, కంచర్ల శివకుమార్, బయ్యాస్వామి, డాక్టర్ హరి రమాదేవి, తుమిక రమేశ్బాబు, మసూద్, కేతిరి రాజశేఖర్, ఎండీ ఇక్బాల్, చిమ్మని సంతోష్, క్యాతం రంజిత్, సిలువేరు పవన్కుమార్ పాల్గొన్నారు.