వాజేడు, మార్చి 9 : వాజేడు మండలంలోని గుమ్మడిదొడ్డి గ్రామస్తులు తెలియని వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్లు, కీళ్ల నొప్పులు, వైరల్ ఫీవర్తో మంచం పట్టారు. 12 రోజుల క్రితం ముగ్గురితో మొదలైన బాధితుల సంఖ్య ప్రస్తుతం 70కి చేరింది. స్థానిక వైద్యాధికారులు గ్రామానికి వచ్చి వైద్యం అందించినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇప్పటికే రక్త నమూనాలు సేకరించి జిల్లాకేంద్రంలోని టీ హబ్కు పంపగా ఇప్పటివరకు ఎలాంటి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కాకపోవడంతో ఏం జరుగుతున్నదో తెలియక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కలెక్టర్ ఇలా త్రిపాఠి సైతం మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యాధికారులను ఆదేశించడంతో పాటు ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ మాస్క్లు ధరించాలని సూచించారు. ఇంత జరుగుతున్నా జిల్లా వైద్యాధికారి మాత్రం గ్రామం వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రజలు ఏ వ్యాధితో బాధపడుతున్నారు? తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? మెరుగైన వైద్యం కోసం ఎక్కడికైనా తరలించాలా ? ఇక్కడే ఉంచి వైద్యం అందించాలా అనే దానిపై వైద్యాధికారులతో రివ్యూ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఇంటింటా సర్వే
తాజాగా కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ డీఎంహెచ్వో విపిన్కుమార్ ఆధ్వర్యంలో శనివారం వాజేడు వైద్యాధికారుల బృందం గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహించింది. బాధితులను గుర్తించి రక్త నమూనాలను జిల్లాకేంద్రానికి పంపినట్లు తెలిపారు. అలాగే పీహెచ్సీని సందర్శించి రిజిస్టర్లను పరిశీలించారు. ఇప్పటివరకు సేకరించిన రక్త నమూనాలపై ఆరా తీయడంతో పాటు అందిస్తున్న వైద్యచికిత్స గురించి అడిగి తెలుసుకొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. గతంలో వైద్య పరీక్షలు చేసి ల్యాబ్కు పంపినా ఎలాంటి వ్యాధులు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని, వైరల్ ఫీవర్గా భావిస్తున్నట్లు ఆయన వివరించారు. శనివారం గ్రామంలో 10మందికి హైదరాబాద్ నుంచి తెప్పించిన డబ్ల్యూహెచ్వో(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ద్వారా తీసిన రక్త నమూనాల ఆధారంగా వచ్చే రిజల్ట్స్తో ఎలాంటి వ్యాధి ఉందో నిర్ధారణ అవుతుందో తెలుస్తుందన్నారు. ఇక్కడ వైద్యాధికారులు కొమురం మహేందర్, రహెల్, అభినవ్, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.