జనగామ చౌరస్తా, మార్చి 27 : అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన జనగామలో మంగళవా రం అర్ధరాత్రి జరిగింది. జనగామ అర్బన్ సీఐ ఎల్ రఘుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన సెల్వరాజు(59), భాగ్యలక్ష్మి(55) దంపతులు. వీరు ఉపాధి కోసం 30 ఏళ్ల క్రితం జనగామ పట్టణానికి వలస వచ్చారు. ఇక్కడి గ్రెయిన్ మార్కెట్ ఏరియాకు సమీపంలోని రైల్వే చిన్నమోరీ వద్ద నివాసం ఉంటున్నారు. ఇక్కడే కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు. పాపుడాలు, ఆలూ చిప్స్, లడ్డూలు, మిక్షర్ వంటి తినుబండారాలు తయారు చేసి చుట్టుపక్కల ప్రాంతాలైన బచ్చన్నపేట, చేర్యా ల, సిద్దిపేట పట్టణాల్లోని కిరాణం అండ్ జనరల్ స్టోర్ దుకాణాలకు టాటా ఏస్ వాహనాల్లో సరఫరా చేసేవారు. వీరికి ఇద్దరు కుమారులు పళనిస్వామి, చిన్నస్వామి, కూతురు నాగజ్యోతి ఉన్నారు. వీరి వివాహాలు జరిగాయి.
కూతురు తమిళనాడులో ఉంటుండగా, కుమారులిద్దరూ ఇక్కడే వేరుగా ఉంటున్నారు. వ్యాపార నిర్వహణ కోసం వీరు బ్యాంకులో రూ.15లక్షల రుణం తీసుకున్నారు. అలాగే పరిచయస్తుల వద్ద సుమారు రూ.30 లక్షల వరకు అప్పు చేసినట్లు సమాచారం. ఇటీవల రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో సెల్వరాజ్, భాగ్యలక్ష్మి దంపతుల మధ్య గొడవలు మొదలయ్యా యి. మంగళవారం అర్ధరాత్రి వీరి మధ్య మాటామాట పెరిగి క్షణికావేశంలో పెట్రోల్, డీజిల్ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ దామోదర్రెడ్డి పరిశీలించారు. ఎస్సై సృజన్ కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ రఘుపతిరెడ్డి పేర్కొన్నారు. సెల్వరాజు, భాగ్యలక్ష్మి దంపతులు బలవన్మరణానికి పాల్పడడంతో స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటన జనగామలో తీవ్ర విషాదం నింపింది.