నర్సంపేట రూరల్, ఫిబ్రవరి 8: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విలేకరులు గాయపడిన ఘటన బుధవారం ఉదయం నర్సంపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నారావుపేటకు చెందిన గాండ్ల ప్రదీప్, నర్సంపేటకు చెందిన బుర్ర వేణు బైక్పై వార్త సేకరణకు వెళ్తున్నారు. వారు నర్సంపేట పట్టణం వల్లబ్నగర్ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఆర్చీ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి ట్రాలీ వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు విలేకర్లు కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ప్రదీప్ కడుపులో తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఎడమ కాలి మోకాలు చిప్ప పగలిన వేణును నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వెంటనే గాయపడిన విలేకరులకు మెరుగైన వైద్యం అందించాలని ఫోన్లో నర్సంపేట ఆస్పత్రి సూపరింటెండెంట్తో మాట్లాడారు. అనంతరం వేణు, ప్రదీప్ చికిత్స పొందుతున్న ప్రైవేటు దవాఖానల యాజమాన్యాలతో కూడా ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఎమ్మెల్యే పెద్ది దంపతుల చేయూత
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు జర్నలిస్టులకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న దంపతులు చేయూత నిచ్చారు. హనుమకొండలోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రదీప్ను పెద్ది స్వప్న కలిసి పరామర్శించారు. దవాఖాన యాజమాన్యంతో మాట్లాడి ప్రదీప్ డిశ్చార్జి అయ్యే వరకూ వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం మెడికల్ బిల్లులు, సర్జరీ కోసం రూ. లక్ష అందించారు.
అత్యవసరమైతే ప్రదీప్ను హైదరాబాద్కు తరలించి అన్ని విధాలా ఆదుకుంటామని బాధిత కుటుంబ సభ్యులకు ఆమె భరోసా ఇచ్చారు. అదేవిధంగా నర్సంపేటలోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న బుర్ర వేణును పెద్ది స్వప్న పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, మోకుదెబ్బ పొలిట్బ్యూరో సభ్యుడు అనంతుల రమేశ్గౌడ్, ఎస్సై బొజ్జ రవీందర్, సోల్తి సారయ్య, వీరన్న, జర్నలిస్టులు పాల్గొన్నారు.