ఏజెన్సీ గ్రామాలకు ఉపాధి వనరు
అటవీ ప్రాంతాల్లో జోరుగా సేకరణ
ఈ ఏడాది లక్ష్యం 23,800 స్టాండర్డ్ బ్యాగులు
నెల చివరి వరకు పూర్తి చేసేలా కసరత్తు
ఒక్కో కట్ట ధర రూ.2.05
ప్రకృతి సంపద తునికాకు. ప్రతి వేసవిలో వందలాది మందికి నెలరోజుల పాటు ఆదాయ వనరు. ప్రతి ఏడాది మే నెలలో తునికాకు సేకరిస్తారు. ఈ సంవత్సరం తునికాకు ఏపుగా పెరిగి కోతకు సిద్ధంగా ఉండడంతో ములుగు జిల్లాలో ఆదివాసీలు, అటవీ గ్రామాల ప్రజలు సేకరణలో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 23,800 స్టాండర్డు బ్యాగుల ఆకుసేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతీ 50 ఆకుల కట్టకు రూ.2.05లు చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది 23.310 స్టాండర్డు బ్యాగుల సేకరణ లక్ష్యం ఉండగా ఈ ఏడాది 490 బ్యాగులను అధికంగా సేకరించాలని నిర్ణయించారు.
ఏటూరునాగారం, మే 20 : వేసవిలో తునికాకు సేకరణ కూలీలకు వరంగా మారింది. ఎండాకాలం రాగానే అటవీ ప్రాంత గ్రామాల్లో ఆకు సేకరణ ప్రారంభమవుతుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో గిరిజనులు వేకువజామునే అడవికి బయలుదేరి 10 గంటల లోపే సేకరించిన ఆకు మూటలతో ఇంటికి చేరుకుంటారు. కొద్దిసేపు సేదతీరి కట్టలు కట్టి సాయంత్రం కల్లాల వద్దకు చేరుకుని కట్టలను కల్లెదారులకు అప్పగిస్తారు. ఆకు సేకరణ కోసం అటవీశాఖ ముందస్తుగానే టెండర్లు నిర్వహించడంతో కాంట్రాక్టర్లు వారికి కేటాయించిన గ్రామాల్లో కల్లాలను ఏర్పాటు చేశారు. ఆకు ఏపుగా రావడం కోసం నెల రోజుల ముందు కొమ్మ కొట్టడం చేస్తుంటారు. మే నెలలో ఆకు సేకరణ పూర్తి చేస్తారు. చిన్నారులు సైతం ఆకు సేకరణలో పాల్గొంటారు. ఆకు సేకరణకు అవకాశం లేని ఇతర ప్రాంతాలకు చెందిన వారు తమ బంధువుల ఇంటికి వచ్చి వారం, పది రోజుల పాటు ఉండి సేకరణలో పాల్గొని ఉపాధి పొందుతారు.
జిల్లా వ్యాప్తంగా 23,800 స్టాండర్డు బ్యాగుల సేకరణ
జిల్లా వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో ఆకు సేకరణకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 23,800 స్టాండర్డు బ్యాగుల ఆకు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతీ 50 ఆకుల కట్టకు రూ.2.05లు చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ములుగు డివిజన్ పరిధిలో నార్లాపూర్, బూరుగుపేట, ఇంచర్ల, మల్లంపల్లి, నారాయణపూర్, పాలంపేట, పత్తిపల్లి, వెంకటాపురం యూనిట్లలో 93 కల్లాలు ఏర్పాటు చేసి వాటి నుంచి 8300, తాడ్వాయి డివిజన్ పరిధిలో కొడిశాల, మంగపేట, మల్లూరు, లింగాపూర్, కాటాపూర్ ఏ, బీ, లవ్వాల యూనిట్లలోని 71 కల్లాల ద్వారా 5,900లు వెంకటాపురం డివిజన్లోని చీకుపల్లి, ఆలుబాక, పేరూరు, వెంకటాపురం యూనిట్లలోని 84 కల్లాల ద్వారా 3,100, ఏటూరునాగారం డివిజన్ పరిధిలోని ఏటూరునాగారం, తుపాకులగూడెం ఏ, బీ, షాపల్లి, మొట్లగూడెం, తాడ్వాయి ఏ, బీ, యూనిట్లలోని 51 కల్లాల ద్వారా 6,500 స్టాండర్డు బ్యాగుల ఆకు సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, గత ఏడాది 23.310 స్టాండర్డు బ్యాగుల సేకరణ లక్ష్యం ఉండగా ఈ ఏడాది 490 బ్యాగులను అధికంగా సేకరించేందుకు లక్ష్యం పెంచారు.