చిన్నగూడూరు/కురవి, జనవరి 1 : నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వెళ్లిన స్నేహితుల్లో ముగ్గురిని రోడ్డు ప్రమాదం కబలించడం మృతుల కుటుంబాల్లో విషాదాన్ని నింపిం ది. వివరాల్లోకి వెళ్తే.. మానుకోట జిల్లా చిన్నగూడూరు మండలం మంగోరిగూడెం గ్రామానికి చెందిన బానోత్ సుమన్, నవీన్, యాకారపు శ్రీకాంత్, డెంకల నవీన్, మచ్చ శేఖర్, సునావత్ వీరన్న, బానోత్ రమేశ్, బానోత్ రాము, లింగంపల్లి రాంబాబు శనివారం సాయంత్రం కురవికి వెళ్లారు. అక్కడ కేక్ తీసుకుని నూతన సంవత్సర వేడుకలను గ్రామంలో జరుపుకునేందుకు ఆటోలో బయల్దేరారు. ఆటో కందికొండ స్టేజి నుంచి కురవికి వెళ్తుండగా మహబూబాబాద్ నుంచి కురవి మీదుగా మరిపెడకు వెళ్తున్న గ్రానైట్ లారీ అటోను ఢీకొంది. ఈ ఘటనలో లారీలోని బండరాళ్లు సుమన్, శ్రీకాంత్పై పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాపడిన నవీన్ను వరంగల్లోని దవాఖానకు చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మృతిచెందాడు.
మిగిలిన ఐదుగురిలో శేఖర్ను ఖమ్మం, రామును వరంగల్ దవాఖానకు తరలించారు. వీరన్న, రాంబాబు, రమేశ్ను మహబూబాబాద్లోని దవాఖానలో చేర్చగా చికిత్స పొందుతున్నారు. మగ్గురు మృతదేహాలకు పోష్టుమార్టం నిర్వహించిన పోలీసులు కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పజెప్పారు. సుమన్ మృతదేహాన్ని గ్రామ కంపోస్టు షెడ్లో ఉంచగా అక్కడికి చేరుకున్న అతని ముగ్గురు కుమార్తెలు, కుమారుడు, నాన్న ‘ఇంటికి పోదాం లే నాన్న ..’ అంటూ రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఒకే కుటుంబానికి చెందిన సుమన్, సురేశ్ అన్నదమ్ములు. సురేశ్కు తీవ్రగాయాలయ్యాయి. మృతుడు శ్రీకాంత్కు రెండు నెలల బాబు ఉన్నాడు. ‘చంటి పిల్లాడితో మీ నాన్న నిన్ను చూడటానికి ఇక రాడురా.. నిన్ను ఎత్తుకుని ఆడించేది ఎవరు..’ అని బోరున విలపించారు. సరదాగా ఉన్న స్నేహితులను మృత్యువు కబళించగా ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. కాగా సుమన్ మృతదేహాన్ని కుటుంబ సబ్యులు, బంధువులు అంత్యక్రియల కోసం తరలిస్తూ కురవి మండలంలోని ఘటనా స్థలికి తరలించి రోడ్డుపై ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ధర్నా చేశా రు. దీంతో పోలీసులు హుటాహుటిన కురవికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం మంగోరిగూడేనికి మృతదేహాన్ని తరలించారు.
పోలీసుల భారీ బందోస్తు
ముగ్గురి మృతితో మంగోరిగూడెంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమన్, శ్రీకాంత్ మృతదేహాలను ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించగా అం త్యక్రియలు నిర్వహించారు. నవీన్ తల్లి సూరత్ నుంచి వచ్చాక సోమవారం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. సుమన్కు భార్య, కుమార్తెలు స్పందన, ఆలేఖ్య, అక్షర, కుమారుడు ఛత్రపతి ఉన్నారు. నవీన్కు భార్య, కుమారుడు ప్రజ్వల్, కుమార్తె నక్షత్ర ఉండగా, శ్రీకాంత్కు భార్య, రెండు నెలల బాబు ఉన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుని ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. బందోబస్తులో సీఐ సాగర్ ఎస్సైలు రవికుమార్, నరేశ్, పవన్కుమార్, జితేందర్, జగదీశ్, మంగీలాల్ ఉన్నారు.