చెరువు శిఖం కబ్జాలమయమైంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వందలాది అక్రమ నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. హద్దులు ఏర్పాటు చేసినా ఆనవాళ్లు సైతం కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నగరాల్లోని చెరువుల కబ్జాలు, వాటిలో నిర్మాణాలపై సర్వే చేయాలని ఆదేశించింది. దీంతో గ్రేటర్లోని ఆరు చెరువుల పరిధిలో అధికారులు సర్వే చేయగా అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సర్వే నివేదిక అందజేశారు. ఆ తర్వాత సర్కారు నిర్ణయం మేరకు చర్యలు తీసుకోనున్నారు.
చెరువుల పరిరక్షణపై బల్దియా దృష్టి సారించింది. రోజురోజుకూ విస్తరిస్తున్న నగరంతో పాటు చెరువులు కుదించుకుపోతున్నాయి. చెరువులకు ఆనుకోని అనేక నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో గ్రేటర్ వరంగల్లోని ఆరు చెరువుల పరిధిలో అధికారులు సర్వే నిర్వహించారు. ఇందులో అనేక విషయాలు వెలుగుచూశాయి. దశాబ్దాల క్రితం నగర పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు హద్దులను ఏర్పాటు చేసినప్పటికీ వాటి ఆనవాళ్లు ప్రస్తుతం లేకుండా పోయాయి. వందల సంఖ్యలో నిర్మాణాలు వెలిశాయి. కొన్ని చోట్ల గ్రేటర్ అధికారులు పర్మిషన్లు ఇవ్వడం చూసి సర్వేకు వెళ్లిన అధికారులు సైతం తెల్లమొహం వేసినట్లు సమాచారం. అయితే కొత్త ప్రభుత్వం సర్వే నివేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది.
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని బంధం చెరువు, వడ్డేపల్లి చెరువు, భద్రకాళీ చెరువు, కోటి చెరువు, చిన్న వడ్డేపల్లి చెరువు, రంగ సముద్రం(ఉర్సు చెరువు) చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్, వాటి పరిధిలో చేపట్టిన నిర్మాణాలపై సర్వే చేశారు. నివేదికను కొన్ని రోజుల క్రితం అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందజే శారు. ఇప్పటికే చెరువు శిఖం పరిధిలో అనేక నిర్మాణాలు వెలిసినట్లు బల్దియాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా వడ్డేపల్లి, చిన్నవడ్డేపల్లి, బంధం, భద్రకాళీ చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వందల సంఖ్యలో నిర్మాణాలు వెలిసినట్లు సర్వేలో తేలినట్లు అధికారులు చెబుతున్నారు. చాలా నిర్మాణాలు అనుమతులు లేకుండానే చేశారని, వీటిపై ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామంటున్నారు.
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిని ప్రామాణికంగా తీసుకొని సర్వే చేశారు. కొత్త మాస్టర్ప్లాన్లో వీటిని చూపించారు. సర్వే ఆధారంగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో చేపట్టిన నిర్మాణాలకు గ్రేటర్ అధికారులు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే నోటీసుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
ఖిలావరంగల్, మే 24 : పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రచారాలు నిలిపేయాలని డీఆర్వో ప్రావీణ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు.. ఉపఎన్నిక ముగిసే 48 గంటల ముందు నుంచి పోటీల్లో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్లు సెండ్ చేయొద్దని తెలిపారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అభ్యర్థులు, ఆయా రాజకీయ పార్టీలు, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు సైతం 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఎలాంటి ప్రచారాలు చేయొద్దని పేర్కొన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల కోసం ఎల్బీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఈ నెల 21 నుంచి శుక్రవారం వరకు 143 మంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నట్లు తెలిపారు.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓటు హక్కు నమోదు చేసుకున్న పట్టభద్రులు తమ ఓటు హక్కును పరిశీలించుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఓటర్లకు స్లిప్లు పంపిణీ చేశామని తెలిపారు. ఇంకా అందని వారు ఉంటే వెబ్సైట్లో తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని పేర్కొన్నారు.