కరీమాబాద్, నవంబర్ 28 : మనం నివసించే ఇంటితో పాటు మనం పని చేసే కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ బీ గోపి కోరారు. ఆదివారం కలెక్టరేట్ ఆవరణలోని చెత్తాచెదారాన్ని అధికారులతో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అన్నారు. అధికారులు, సిబ్బంది చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయవద్దన్నారు. చెత్త బుట్టలోనే వేయాలన్నారు. వాహనాలను క్రమపద్ధతిలో నిలుపాలన్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది కలిసికట్టుగా కార్యాలయాలను ప్రతి రోజూ శుభ్రం చేయాలన్నారు. కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సైతం అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నేడు గ్రీవెన్స్..
నేటి నుంచి ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ గోపి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు.