మహదేవపూర్, ఫిబ్రవరి 12 : భారతీయ వస్త్ర పరిశ్రమలో అధిక నాణ్యమైన ప్రకృతి సిద్ధంగా దొరికే పట్టు వస్ర్తాలకు మార్కెట్లో చాలా ప్రాముఖ్యత ఉంది. పట్టు ఉత్పత్తిలో భారతదేశం రెండో స్థానంలో ఉండగా దసలిపట్టు తయారీలో మహదేవపూర్ కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. 1985 సంవత్సరంలో ఇక్కడ దసలిపట్టు పరిశ్రమ ప్రారంభం కాగా మండలకేంద్రంలో సెరికల్చర్ కార్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సుమారు 40 చేనేత కుటుంబాలు చేనేత వస్త్ర తయారీనే జీవనాధారంగా మల్చుకున్నాయి. అప్పటినుంచి పరిశ్రమ నిరంతరం కొనసాగుతుండడంతో దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి నాణ్యమైన దసలిపట్టు వస్ర్తాలను కొనుగోలు చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా పట్టులో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మల్బరీ పట్టు, ఇరిపట్టు, ముగా పట్టు, ఓక్ పట్టు, టస్సర్ పట్టు తెలంగాణలో ఉత్పత్తి అవుతుండగా మహదేవపూర్లో దసలిపట్టు(టస్సర్) తయారీలో ప్రత్యేకంగా నిలిచింది. దసలిపట్టు పురుగులు ఎర్రమద్ది, నల్లమద్ది ఆకులను ఆహారంగా తీసుకుంటాయి.
మహదేవపూర్ శివారు అటవీ ప్రాంతంలో వందల ఎకరాల్లో రైతులు పట్టు పురుగులను పెంచుతుండగా ప్రభుత్వం అటవీ శాఖకు లీఫ్ ట్యాక్స్ చెల్లిస్తున్నది. గ్రామంలో ఇదే వృత్తిగా చేసుకొని సుమారు 400 రైతు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గుడ్డు దశ నుంచి గుడ్డ దశ వరకు అంతా ఇక్కడే జరుగుతుంది. పట్టు దారానికి మూలం పట్టు కాయలు. ఇందుకోసం రైతులు పట్టు సీడ్ను కొనుగోలు చేసి ప్రత్యేక పద్ధతుల్లో ఎర్రమద్ది, నల్లమద్ది చెట్లపై పెంచి పురుగులు కాయలుగా మారిన తర్వాత విక్రయిస్తారు. నేతన్నలు కాయల ద్వారా వివిధ పద్ధతుల్లో దారాన్ని నులికి వస్ర్తాలు తయారు చేస్తారు. సెరికల్చర్ శాఖ రైతులకు, నేతన్నలకు సంధానకర్తగా వ్యవహరిస్తుంది. దశాబ్దాలుగా మహదేవపూర్లో గిరిజనులు, బీసీ కుటుంబాలు పట్టు పురుగులను పెంచుతూ జీవనం సాగిస్తుండగా, టస్సార్ వస్ర్తాలు నేస్తూ నేతన్నలు జీవనోపాధి పొందుతున్నారు. దీనిపై పరోక్షంగా చాలా మంది ఉపాధి పొందుతున్నారు.
పట్టు పరిశ్రమలో రైతులు పట్టు పురుగుల పంట సాగు చేసి పట్టు కాయలను రైతులు సెరికల్చర్ శాఖకు అందజేస్తారు. వారు చేనేత కార్మికులకు వేలం ద్వారా విక్రయిస్తారు. కాయలను ఉడక బెట్టి రీలింగ్ పద్ధతిలో దారాన్ని తీసి మగ్గంపై పలు రకాల వస్ర్తాలను నేసి బహిరంగ మార్కెట్లో లేదా సొసైటీలో అమ్ముతారు. ప్రభుత్వం చేనేత పింఛన్, సబ్సిడీతో ఇతర సదుపాయలు కల్పిస్తున్నది.
మార్కెటింగ్ ఇలా..
చెట్టు నుంచి తీసిన కకూన్లను రైతులు సెరికల్చర్ కార్యాలయంలో విక్రయిస్తారు. మేలైన కకూన్లకు రూ.2 చెల్లిస్తారు. నాణ్యత తక్కువగా ఉన్న కాయలకు ధర తక్కువగా ఉంటుంది. కాయలను దండలుగా మార్చి ఒక్కో దండలో సుమారు 100 కకూన్లు ఉంచుతారు. వీటిని సెరికల్చర్ శాఖ ఆధ్వర్యంలో గైనేజి నిర్వహించడంతో కాయలో నుంచి సీతాకోకచిలుక బయటకు వస్తుంది. వాటిని మేల్, ఫిమేల్తో కప్లింగ్ చేసి మళ్లీ సీడ్ తయీరు చేస్తారు. ఈ సీడ్ను రైతులకు అందజేస్తారు. పురుగు బయటకు వచ్చిన కాయలను చేనేత కార్మికులకు వేలం పాట ద్వారా విక్రయిస్తారు.
పట్టు పురుగుల పెంపకం
రైతులు ముందుగా దసలిపట్టు సీడ్ను సెరికల్చర్ ద్వారా కొనుగోలు చేసి వాటిని ట్రేలలో పొదిగిస్తారు. ఆ గుడ్ల నుంచి లార్వా బయటి వస్తుంది. ఈత ఆకులను దారంపోగుల్లా చీల్చి గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వా వద్ద ఉంచుతారు. వాటిపై పురుగులు గుంపులుగా చేరుతాయి. ఆ తర్వాత వాటిని ఎర్రమద్ది, నల్లమద్ది చెట్లపై నెమ్మదిగా వదులు తారు. ఆ పురుగు లు ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. ఇలా నాలుగు రోజులు కదలకుండా స్తబ్దుగా చెట్టుపైనే ఉంటాయి. ఈ దశలో పట్టుపురుగు ఆహారం తీసుకో కుండా 24గంటల వరకు ఉన్న తర్వాత లార్వా తనపై ఉన్న పైపొరను తొలగించుకుంటుంది. దీనిని రెండో దశగా పిలుస్తారు. 3, 4 దశల్లో మళ్లీ నాలుగు రోజుల వ్యవధిలో విపరీతంగా ఆహారం తీసుకొని తర్వాత కదలకుండా ఉంటుంది.
తర్వాత పైపొరను తొలగించుకొని తరువాతి దశకు చేరుతుంది. ఇలా నాలు గు దశలు మారిన తర్వాత పురుగు తొమ్మిది రోజుల పాటు ఆహారం తీసుకో కుండా ఉండి, పట్టుపురుగు చుట్టూ జిగురు లాంటి ద్రవ పదార్థంతో(సిల్క్) కోడిగుడ్డు ఆకారంలో గూడు అల్లి గోధుమరంగులో కాయను తయారు చేస్తుంది. వీటినే కకూన్లని పిలుస్తారు. చెట్టుపై కకూన్ తయారైన నాలుగు రోజుల తర్వాత రైతులు చెట్టు పైకి ఎక్కి జాగ్రత్తగా దానిని కోసి తీస్తారు. సాగులో భాగంగా రైతులకు ఉపయోగపడే కీటకాల బారి నుంచి పురుగులను కాపాడేందుకు రసాయనాలు, కొమ్మలు కోసేందుకు కట్టర్లు, తదితర పరికరాలను ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నది.
దసలిపట్టు దారం తయారీ
చేనేత కార్మికులు ప్రత్యేక పద్ధతుల్లో ఉడకబెట్టి టస్సార్ తోడి, రాట్నం వడికి, పడుగు పోసి రీలింగ్ ద్వారా దారాన్ని తీసి, తీసిన దానంలో సరి చేయు ప్రక్రియను చేస్తారు. మగ్గంపై వస్ర్తాలను నేసి విక్రయిస్తారు. ఈ పట్టునే అహింసా పట్టు అని కూడా పిలుస్తారు. వస్ర్తాలకు పలు రకాల రంగులను అద్ది అందంగా తీర్చిదిద్దుతారు. చీరలు, శాలువాలు, లుంగీలతో పాటు పలు రకాలు వస్ర్తాలను తయారు చేస్తారు. ఒక్కో నాణ్యమైన కాయ(పింజ) నుంచి సుమారు కిలోమీటర్ దారం వస్తుంది. దేశంలోని నలుమూలల నుంచి కాళేశ్వరం క్షేత్రానికి వచ్చే పర్యాటకులు స్వయంగా టస్సర్ కాలనీ చేనేత కార్మికుల ఇంటికి వెళ్లి రకరకాల చేనేత వస్ర్తాలను కొనుగోలు చేస్తారు.
అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం
పట్టు సాగుపై రైతులకు మెళకువలు చెబుతూ కొత్త పద్ధతుల్లో వస్ర్తాల తయారీపై చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వం అందించే యంత్ర పరికరాలు, పథకాలపై ఎప్పటికప్పడు అవగాహన కల్పిస్తున్నాం. మహదేవపూర్ పట్టు విత్తన ఉత్పత్తి కేంద్రంలో విత్తనం ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తాం. ఒక సంవత్సరంలో రెండు క్రాప్లు వస్తాయి. మొదటి పంటలో విత్తన ఉత్పత్తిలో భాగంగా జనవరి, ఫిబ్రవరి నెలలో ఓపెన్ టెండర్ ద్వారా ఎంపిక చేసిన రైతులకు సీడ్ను అందజేస్తాం. రెండో పంటలో అందరు రైతులకు సీడ్ ఇస్తాం. 25శాతం స్థానిక సొసైటీలకు కేటాయిస్తాం.
– సెరికల్చర్ ఆఫీసర్, పీ సమ్మయ్య
చేనేత వృత్తిని సర్కారు ప్రోత్సహిస్తున్నది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత వృత్తిని ప్రో త్సహిస్తున్నది. చేనేత వృత్తులకు ప్రభుత్వ పరంగా సాయం అందుతున్నది. పెన్షన్, బీమా సౌకర్యం, థ్రిఫ్ట్ ఫండ్, సబ్సిడీ అందిస్తున్నది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– హరిశంకర్ చేనేత యువ కార్మికుడు
ఇదే మాకు జీవనాధారం
పట్టు పురుగుల పెంపకమే మాకు జీవనాధారం. గిరిజనులతో పాటు బీసీ కులాలకు చెందిన సుమారు 400 కుటుంబాలు వీటి పెంపకంపై అధారపడి బతుకుతున్నాయి. గుడ్ల దశ నుంచి మొదటి పురుగు దశ, కాయ దశ వరకు నిరంతరం కష్టపడుతాం. చాలా జాగ్రత్తగా చెట్లపైకి ఎక్కి కట్ చేస్తాం. మాకు ప్రమాద బీమా సదుపాయం కల్పించాలి.
– కాల్నేని రాములు, దసలిపట్టు రైతు