హనుమకొండ, మే 25 : ఉపాధి కూలీలలకు తెలంగాణ తపాలా శాఖ శుభవార్త అందించింది. కూలీలు పడుతున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఇంటి వద్ద లేదా పని చేసే ప్రాంతంలో వేతనం తీసుకొనే వెసలుబాటు కల్పించింది. కొంతమంది ఉపాధి కూలీలకు బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో వేతనాలు తీసుకొనేందుకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తపాల శాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ను కూడా సంప్రదించామని పోస్టల్ శాఖ అధికారులు తెలిపారు.
కూలీల ఇబ్బందులు తొలగించేందుకే..
ఉపాధి హామీ కూలీల ఇబ్బందులు తొలగించేందుకు పోస్టల్ శాఖ కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలో చాలా మంది కూలీలకు బ్యాంకు ఖాతాలు లేవని గుర్తించినట్లు పోస్టల్ అధికారులు తెలిపారు. రాష్టంలో ఎండల తీవ్రత ఎకువగా ఉండడంతో వ్యవసాయ పనులు బాగా తగ్గిపోయి ఉపాధి పనులకు ప్రాధాన్యం పెరిగిందని, కూలీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదన్నారు. హనుమకొండ డివిజన్ పరిధిలో 470 వరకు పోస్టాఫీసులు ఉన్నాయి. ఉపాధి కూలీలకు సేవింగ్స్, ఐపీపీబీ ఖాతాలు తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ ఖాతాలు తెరిస్తే ఇంటి వద్ద, పని చేసే ప్రాంతంలోనే కూలి డబ్బులు తీసుకొనే అవకాశం ఉంటుందన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
ఉపాధి కూలీల కోసం పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కూలీల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీసుల్లో వారికి సేవింగ్స్, ఐపీపీబీ ఖాతాలు తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ ఖాతాలు తెరిస్తే ఇంటి వద్ద, పని చేసే ప్రాంతంలోనే కూలి డబ్బులు తీసుకొనే అవకాశం ఉంటుంది.
– బీ నందా, పోస్టల్ సూపరింటెండెంట్, హనుమకొండ డివిజన్