వరంగల్ : గిరిజన సంస్కృతికి, సంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీక అని ర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్దన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండా, గుబ్బేటి తండా, నిలగిరిస్వామి తండాలలో నిర్వహించిన తీజ్ వేడుకలకు వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజన యువతులు, మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకునే పండుగ తీజ్ పండుగ అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే తీజ్ పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నడం ఆనందంగా ఉందన్నారు. అనాదిగా వస్తున్న ఆచారాలను, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలకు సమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అనంతరం డప్పు వాయిద్యాల మధ్య మొలకల బుట్టలతో ఊరేగుంపు చేస్తున్న గిరిజన యువతులతో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేశారు. కార్యక్రమంలో మండల, స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.