శాయంపేట, జనవరి 16 : చలివాగు ప్రాజెక్టు మరమ్మతులకు తీర్మానం చేసి నెల రోజులు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లో ప్రధాన జలవనరైన చలివాగు ప్రాజెక్టు మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10.21కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం తొమ్మిది నెలల్లోనే పనులు పూర్తి చేయాల్సి ఉంది. దీంతో ఆయకట్టులో క్రాప్ హాలీడే ప్రకటించారు. రైతులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇరిగేషన్ అధికారులు ఈ యాసంగి సీజన్లో పంటలు వేయొద్దని గత ఏడాది డిసెంబర్ 16న చలివాగు కట్టపై తీర్మానించారు. ఈమేరకు రైతులు పంటలను వేయలేదు. కానీ ఇప్పటివరకు నెల రోజులు గడుస్తున్నా కాంట్రాక్టర్ మరమ్మతులు ఇంకా ప్రారంభించలేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బహుళ ప్రయోజక ప్రాజెక్టు
చలివాగు కింద ఏటా యాసంగికి 1400 నుంచి 1800 ఎకరాల వరకు తైబందీ ఖరారు చేస్తారు. చలివాగు ప్రాజెక్టు నిర్మించి 60 ఏండ్లు కావడంతో కాల్వలు, లైనింగ్, తూము, కట్ట దెబ్బతిన్నాయి. ప్రాజెక్టులో సిల్ట్ చేరింది. దీంతో పూర్తి మరమ్మతులకు ప్రభుత్వం రూ.10.21కోట్లను కేటాయించింది. చలివాగు జలాశయం పరకాల, రేగొండ, శాయంపేట, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల పరిధి గ్రామాల రైతులకు జీవధారగా ఉంది. చలివాగులోకి నీళ్లు వస్తే చిట్యాల వరకు పొలాల రైతులకు అందుతాయి. ఈ జలాశయం కింద 5వేల ఎకరాలకుపైగా సాగవుతుంది. చలివాగు ప్రాజెక్టు ప్రధాన కాల్వ 10 కిలోమీటర్లు కొప్పుల, దమ్మన్నపేట, చెన్నాపూర్ వరకు ఉండగా దీని కింద 124ఎకరాల ఆయకట్టున్నది. కుడి కాల్వ 14 ఉండగా దీని కింద 2,185 ఎకరాలు, ఎడమ కాల్వ కింద నాలుగు కిలోమీటర్లు ఉండగా 737 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ప్రాజెక్టు 24 అడుగుల (500 ఎంసీఎఫ్టీ) నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. హనుమకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గ పరిధిలో 125 గ్రామాలు, శాయంపేటలోని 25 గ్రామాలకు ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇలా తాగు, సాగునీటికే కాకుండా వరంగల్ జిల్లా మెగా టెక్స్టైల్ పార్కుకు కూడా నీటి అవసరాలకు తరలించనున్నారు. బహుళ అవసరాల కోసం చలివాగు జలాశయం కీలకంగా ఉన్న నేపథ్యంలో మరమ్మతులు వేగంగా చేయాల్సి ఉన్నది. వేసవిలోగా ప్రాజెక్టు మరమ్మతులు పూర్తయితే వానకాలం సీజన్కు సాగునీరు అందించవచ్చు. కాంట్రాక్టర్ తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేయాలని అగ్రిమెంట్ జరిగిందని, ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు రావాలని కాంట్రాక్టర్ చూస్తున్నారని, మాట్లాడి వెంటనే పనులు ప్రారంభిస్తామని డీఈ గిరిధర్ వెల్లడించారు.