రంగల్, జనవరి 18: ట్రేడ్ లైసెన్స్ల జారీలో కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని నమోదు చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లతో ట్రేడ్ లైసెన్స్ సర్వేపై ఆమె దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాణిజ్య దుకాణం ప్లింత్ ఏరియా పరిధిని కొలిచి ఆయా సమాచారం ప్రకారం ట్రేడ్ లైసెన్స్ ఫీజు మదింపు చేయాలని ప్రావీణ్య ఆదేశించారు. వారం రోజుల్లో ప్రస్తుతం ఉన్న ట్రేడ్లతోపాటు కొత్తగా దుకాణాలను సర్వే చేయాలని సూచించారు. రోజూ సర్వే వివరాలను పంపించాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ మంజూరులో జవాన్లదే పూర్తి బాధ్యత అన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్లకు కేటాయించిన ప్రాంతాల్లో పూర్తి కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని నమోదు చేయాలన్నారు.
సర్వేలో ఇచ్చిన సమాచారంపై తాను స్వయంగా తనిఖీ చేస్తానన్నారు. దుకాణాల ట్రేడ్ లైసెన్స్ సర్వేతోపాటు వ్యాపారాల డిజిటల్ చెల్లింపులపై సర్వే చేయాలన్నారు. డిజిటల్ చెల్లింపులు ఏ బ్యాంక్ ద్వారా చేస్తున్నారు.. ఏ పద్ధతిలో చేస్తున్నారనే విషయాలను సేకరించి నమోదు చేయాలని స్పష్టం చేశారు. ట్రేడ్ సర్వేలో బకాయిలను వసూలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ రవీందర్యాదవ్, సీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, సీహెచ్వో శ్రీనివాసరావు, బయాలజిస్ట్ మాధవరెడ్డి, డీఎఫ్వో శంకర్లింగం, డిప్యూటీ కమిషనర్లు అనీసుర్ రషీద్, జోనా, శ్రీనివాస్రెడ్డి, ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
న్యూశాయంపేట: భద్రకాళి బండ్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ ప్రావీణ్య అన్నారు. జీడబ్ల్యూఎంసీ అధికారులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో భద్రకాళి బండ్ ఫేస్-2లో కొనసాగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బండ్పై జరుగుతున్న ల్యాండ్ స్కేపింగ్, ఎలక్ట్రికల్, టాయిలెట్, గ్రానైట్ పనులు, బండ్పై జోన్ సీ వద్ద ఏర్పాటు చేస్తున్న జాతీయ జెండా పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం నాణ్యతతో కూడిన పనులను చేపట్టాలని, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఆమె వెంట బల్దియా ఈఈ శ్రీనివాసరావు, సీహెచ్వో శ్రీనివాసరావు, సంజయ్కుమార్, డీఈ రవికుమార్, ఏఈలు ఉన్నారు.