నెక్కొండ, జూన్ 9: సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శనంగా నిలుస్తున్నదని, అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలోని నాగారంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్నతో కలిసి రూ. 5.34 కోట్లతో నిర్మిస్తున్న బీటీ, సీసీరోడ్ల నిర్మాణాకికి శుక్రవారం ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్ది సుదర్వన్రెడ్డి-స్వప్న దంపతుల సహకారంతో నిర్మించిన శ్రీమంజునాథస్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన శివపార్వతులు, సీతారమాచంద్రస్వామి కల్యాణోత్సవం, బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు కనీస జీవనభృతి కల్పించేందుకే సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా సకలజనులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారని, మారుమూల తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. అంతేకాకుండా గిరిజనులకు రాజకీయ రంగంలో పెద్దపీట వేశారని గుర్తుచేశారు. గిరిజన రిజర్వేషన్లను పది శాతానికి పెంచడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయని ఆమె వివరించారు.
నాగారంలో రూ. 1.20 కోట్లతో పీఆర్ రోడ్డు నుంచి పాతతండా వరకు బీటీ రోడ్డు, రూ. 2.14 కోట్లతో టీడబ్ల్యూ రోడ్డు నుంచి నక్కలగుట్టతండా వరకు బీటీరోడ్డు, రూ. 78 లక్షలతో నాగారం నుంచి భవానీతండా వరకు బీటీరోడ్డు, నాగారంలో రూ. 1.20 కోట్లతో అంతర్గత సీసీరోడ్డు నిర్మాణ పనులకు మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి దంపతులు శంకుస్థాపనలు చేశారు.
మారుమూల ప్రాంతమైన నాగారం గ్రామానికి మొట్టమొదటిసారిగా మంత్రి సత్యవతి రాథోడ్ వచ్చారు. అయితే, తమకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతానికి ఏ మంత్రి రాలేదని నాగారం వాసులు తెలిపారు. మొట్టమొదటిసారిగా తమ గ్రామంలో మంత్రి పర్యటించినట్లు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో తమ గ్రామం అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. తమ గ్రామవాసి అయిన జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, ఎమ్మెల్యే పెద్ది సహాయ సహకారాలతో గ్రామంలో శ్రీమంజునాథస్వామి ఆలయాన్ని నిర్మించుకున్నామని, తమ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు.
శ్రీమంజునాథస్వామి ఆలయంలో శివపార్వతులు, సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవాలు వైభవంగా జరిగాయి. కల్యాణంలో మంత్రి, ఎమ్మెల్యే పెద్ది దంపతులు పాల్గొని ప్రత్యేక పూజాలు చేశారు. గ్రామం సస్యశామలంగా, అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలని ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్యా సరోజా హరికిషన్, సర్పంచ్ జల్లె సుదర్శన్, నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, తహసీల్దార్ డీఎస్ వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా బాధ్యుడు చల్లా చెన్నకేశవరెడ్డి, మండల నాయకులు గుంటుక సోమయ్య, సారంగపాణి, సొసైటీ డైరెక్టర్ పొరండ్ల రాంచందర్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట: తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు సమగ్రాభివృద్ధి సాధిస్తున్నాయని మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మండలంలోని ఖదర్పేట క్రాస్ నుంచి కోరన్కుంట, గొల్లపల్లె వరకు రూ. 1.80 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ యువ నాయకుడు కంది కృష్ణచైతన్య సహకారంతో ఏర్పాటు చేసిన తెలంగాణతల్లి విగ్రహాన్ని సత్యవతి ఆవిష్కరించారు. అలాగే, ఎంఈవో రత్నమాల ఆధ్వర్యంలో విద్యార్థులకు మంత్రి, ఎమ్మెల్యే చేతులమీదుగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ తెలంగాణ రా్రష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సమయంలో గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో నేడు రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందన్నారు. కులవృత్తుల వారు అభివృద్ధి చెందేందుకు ముఖ్యమంత్రి ఆర్థిక చేయూతనిస్తున్నట్లు చెప్పారు. అనంతరం విగ్రహ దాత కంది కృష్ణచైతన్యను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మండల అధికారులు, ఎంపీపీ విజేందర్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు రఫీ, మాజీ ఎంపీపీ జక్క అశోక్, అమీనాబాద్ పీఏసీఎస్ చైర్మన్ మురహరి రవి, క్లస్టర్ బాధ్యులు, సర్పంచ్లు కుండె మల్లయ్య, అనుముల కుమారస్వామి, సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.