ఖిలావరంగల్, జనవరి 27: అనారోగ్య సమస్యలతో ఓ జీడబ్ల్యూఎంసీ రిటైర్డ్ శానిటేషన్ జవాన్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. వరంగల్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ నయీంనగర్కు చెందిన రిటైర్డ్ శానిటరీ జవాన్ గద్వాల ఉప్పలయ్య(75) కొంతకాలంగా బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. డయాలసిస్ చేయించుకుంటూ ఇంటి వద్ద ఉంటున్నాడు. ఎన్ని మందులు వాడినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన అతడు వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్ మధ్య 370/29 మైలు రాయి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉప్పలయ్య శరీరం లోకో ఇంజిన్కు చిక్కుకొని జమ్మికుంట రైల్వేస్టేషన్ వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. శరీరం సగం వరకు తెగిపోయి అక్కడక్కడా ముక్కలు పడిపోగా, సగభాగం జమ్మికుంట రైల్వేస్టేషన్లో పడిపోయింది. వరంగల్ రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జమ్మికుంట ప్రభుత్వ దవాఖానలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.