వర్ధన్నపేట, ఫిబ్రవరి 18: భారతీయ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ కళారంగంతోనే సాధ్యమని ప్రముఖ సినీనటి జీవితా రాజశేఖర్ అన్నారు. వర్ధన్నపేట భారతీయ నాటక కళాసమితిలో నిర్వహిస్తున్న 49వ తెలుగు రాష్ర్టాల స్థాయి నాటికల పోటీల ముగింపు కార్యక్రమం శనివారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా ఆమె హాజరై విజేతలను ప్రకటించి బహుమతులు అందించారు. అనంతరం సమితీ అధ్యక్షుడు గాడిపెల్లి రాజేశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జీవిత మాట్లాడుతూ 49 ఏళ్లుగా కళాసమితి నిర్వాహకులు నాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ కళాకారులకు మంచి వేదిక అందిస్తుండడం అభినందనీయమన్నారు. ఆధునిక యుగంలో యువత, పిల్లలు, మహిళలు సైతం టీవీ, సినిమాలు, సెల్ఫోన్లకు బానిసై మనదేశ సంస్కృతీ సంప్రదాయాలను మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో కళాసమితి ఆధ్వర్యంలో కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రజలకు భారత సంస్కృతిని వివరిస్తున్నట్లు చెప్పారు. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ప్రజల దరికి చేరవని, కళా రూపంలో ప్రజలకు ఏది చెప్పినా త్వరగా చేరిపోతుందని వివరించారు. ప్రభుత్వాలు కూడా కళా రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నాలుగు రోజులుగా నిర్వహించిన నాటికల పోటీల్లో విజేతలను ఆమె ప్రకటించడంతోపాటు బహుమతులు అందించారు.
కళాసమితిలో నాలుగు రోజులపాటు నిర్వహించిన నాటిక పోటీలు స్థానికులు, కళాభిమానులను అలరించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని పలు ప్రధాన పట్టణాలు, ప్రముఖ కళారంగ సంస్థల నుంచి వచ్చిన కళాకారులు నాటికలను ప్రదర్శించారు. ప్రధానంగా మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక, నాటికల పోటీలను నిర్వాహకులు రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు నిర్వహించారు. ఇల్లంద గ్రామానికి చెందిన చీపురు మౌనిక ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన భతరనాట్యం విశేషంగా ఆకట్టుకున్నది. అలాగే, పలువురు కళాకారులు కూడా నాటికల ద్వారా సభికులను అలరించారు. కార్యక్రమంలో భారతీయ నాటక కళాసమితి ప్రతినిధులు, పట్టణానికి చెందిన ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.