ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలిస్తున్నదని, మొక్క దశలో రెండేళ్లు కాపాడితే 20 సంవత్సరాల వరకూ రైతులకు కాసులు కురిపిస్తాయని రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. వంట నూనెల ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి రైతులు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పామాయిల్ నర్సరీలోని మొక్కలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో కలిసి రైతులకు పంపిణీ చేశారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలతో దేశంలో వంటనూనెల కొరత నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్పామ్ సాగుకు సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారని తెలిపారు.
జనగామ, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : వంట నూనెల ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకెళ్లాలనే ఉక్కు సంకల్పంతో సీఎం కేసీఆర్ ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆయిల్ ఫెడ్ పామాయిల్ నర్సరీలో జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ, తెలంగాణ రాష్ట్ర సహకార నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య లిమిటెడ్ (టీఎస్ ఆయిల్ఫెడ్) ఆధ్వర్యంలో జిల్లాలో పామాయిల్ సాగు రైతులకు మొక్కలు పంపిణీ చేశారు. జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్రెడ్డి, ఉద్యానవన శాఖ రాష్ట్ర డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి పాల్గొనగా వారు మాట్లాడారు.
ఆయిల్పామ్ కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించడంతోపాటు రైతులకు సబ్సిడీ అందిస్తున్నారని తో ఫామాయిల్ సాగును ప్రొత్సహిస్తున్నారని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మూస పద్ధతిలో సాగు చేస్తున్న వాణిజ్య పంటలైన వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే పెట్టుబడి భరించి సబ్సిడీపై మొక్కలు అందిస్తున్నదని పేర్కొన్నారు. ఉచితంగా మార్కెటింగ్ సహా ధర స్థిరీకరణతో రైతులకు అధిక లాభాలు అందించే ఆయిల్పామ్ సాగుతో రైతులకు కాసుల వర్షం కురుస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ దాని అనుబంధ రంగాల వ్యతిరేక విధానాలతో దేశంలో వంటనూనెల కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రతి ఏడాది దేశ ప్రజల అవసరాలకు 22 మిలియన్ టన్నుల నూనెలు అవసరముండగా, ఇందులో 15 వేల మిలియన్ టన్నుల ఆయిల్ ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. 1987లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు ప్రారంభమైనా నాటి ఆంధ్రా పాలకులు కేవలం ఖమ్మం జిల్లాకు పరిమితం చేసి తెలంగాణకు రానివ్వలేదని పేర్కొన్నారు. రైతుబిడ్డ అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పామాయిల్ సాగుపై ప్రత్యేకంగా దృష్టి సారించారన్నారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాలో పామాయిల్ తోటల సాగును ప్రోత్సహించేందుకు అధిక నిధులు కేటాయించి, ఎకరానికి రూ.27 వేల సబ్సిడీ ఇస్తున్నారని తెలిపారు.
డ్రిప్సాగుకు సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ అందిస్తూ నూనెల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఫామాయిల్ తోట సాగు చేసే రైతులు మొక్క దశలో రెండేళ్లు కాపాడితే 20 ఏండ్లు రైతులకు బంగారు పంటతో లాభాలు వస్తాయని వారు తెలిపారు. జిల్లాలో వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా పామాయిల్ తోటలను సాగు చేయాలని, ఆ దిశగా రైతు వేదికల వద్ద ప్రతి మూడునెలల ఒకసారి రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని రైతుబంధు సమితి అధ్యక్షులకు సూచించారు. సుస్థిర ఆదాయాన్ని అందించే పామాయిల్ తోటల పెంపకం చేపట్టి రైతులు ఆర్ధికంగా మరింత బలోపేతమై సైకిళ్లు, మోటర్ సైకిళ్లపై కాకుండా ప్రతి రైతు కారు కొనుక్కొని తిరిగే రోజులు రావాలని ఆకాంక్షించారు. భారత దేశంలో ఆయిల్ఫామ్ తోటలు పెంచేందుకు వనరులు అనుకూలంగా ఉన్నా కేంద్రం నుంచి సరైన ప్రోత్సాహం, రైతులకు అవగాహన లేకపోవడంతో వివిధ రకాల పంటలు వేసి దిగుబడి రాక నష్టపోతున్నారని అన్నారు. తెలంగాణలో రైతన్న ఆదుకోవాలని దృఢ సంకల్పంతో పామాయిల్ తోటల సాగును విస్తరించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. ఆయిల్పామ్ సాగులో రైతులకు రవాణా ఖర్చులు ఉండవని, కోతులు, దొంగల బెడద ఉండవన్నారు. సాగు చేసిన నాలుగో సంవత్సరం నుంచి ఎకరాకు 5 లేదా 6 టన్నుల పామాయిల్ గెలలు వస్తాయని, టన్నుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల ఆదాయం వస్తుందన్నారు.
రాయితీలు ఎత్తేయాలంటున్న కేంద్రం : ముత్తిరెడ్డి
రైతును రాజును చేసేందుకు సీఎం కేసీఆర్ వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్ అందిస్తుంటే ప్రధాని నరేంద్రమోదీ దీనిని వ్యతిరేకిస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెలిపారు. దేశంలోని ఇతర రాష్ర్టాల రైతులు తెలంగాణలో అమలవుతన్న సంక్షేమ పథకాలను అడుగుతుంటే అక్కసుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్, సంక్షేమ పథఖాలను ఎత్తివేయాలని ఒత్తిడి తెస్తున్నదని ఆయన మండిపడ్డారు. వచ్చే ఏడాది వరకు జిల్లాలో 20 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుచేస్తే 50 ఎకరాల విసీర్ణంలో తరిగొప్పుల వద్ద వంట నూనెల ఉత్పత్తి ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో రైతులకు మేలు జరుగడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని ముత్తిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్, మార్కెట్ చైర్పర్సన్లు పోకల జమున, బాల్దె విజయ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, జడ్పీటీసీ నిమ్మతి దీపిక, ఎంపీపీ మేకల కళింగరాజు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కేఆర్.లత, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రాంరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్కుమార్, ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్రెడ్డి, ఎల్లంల సర్పంచ్ సుజాత పాల్గొన్నారు.
రైతులకు అవగాహన కల్పిస్తాం : పాగాల
ఒకప్పుడు సాగునీరు లేని జిల్లా స్వరాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాక సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి వ్యవసాయం పండుగలా మారిందని జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి అన్నారు. గ్రామ స్థాయిలో పామాయిల్ సాగును విస్తరింప చేసేందుకు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ పామాయిల్ సాగులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందన్నారు. భద్రాచలం ఐటీసీ మేనేజర్ సదానంద మాట్లాడుతూ పామాయిల్ తోటల బౌండరీగా రక్షణతో పాటు ఆదాయాన్ని ఇచ్చే సర్వీ మొకలను ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పారు. అనంతరం పామాయిల్ తోటల సాగుపై చాగల్కు చెందిన ఆకుల రవీందర్, కొడకండ్లకు చెందిన రామేశ్వర్, దేవరుప్పుల మండలం రామరాజుపల్లికి చెందిన రంగారావు, నర్మెటకు చెందిన మల్లారెడ్డి తమ సమస్యలు, సందేహాలు వ్యక్తం చేయగా, ఆయిల్ ఫెడ్ చైర్మన్ నివృత్తి చేశారు.