హసన్పర్తి, డిసెంబర్ 16 : నేత్రదానం.. మరో ఇద్దరికి చూపునిస్తుందనే నినాదాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. కళ్లు దానం చేయడంపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించి చైతన్యం తీసుకొచ్చారు. తొలుత తన తల్లి నేత్రదానంతో మొదలు పెట్టి ఇవాళ 60కి చేరడంలో ముచ్చర్లవాసి, ఎస్సారెస్పీలో డీఈ మండల రవీందర్ చూపిన చొరవ అభినందనీయం. ఫలితంగా నేత్రదానంలో హసన్పర్తి మండలం ముచ్చర్ల గ్రామం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది.
రవీందర్ ఎస్సారెస్పీలో డీఈగా పనిచేస్తూనే ప్రజలకు ఏదైనా చేయాలనేకునేవారు. ఈ క్రమంలో ముచ్చర్లలో 2013లో లయన్స్ క్లబ్ను ఏర్పాటు చేశారు. తన తల్లి మృతిచెందిన సమయంలో ఆమె నేత్రాలను దానం చేశారు. అలాగే గ్రామ ప్రజల్లో, ముఖ్యంగా మహిళలకు నేత్రదానంపై అవగాహన కల్పిస్తూ వచ్చారు. ఇలా 15మంది మహిళలను లయన్స్ క్లబ్లో చేర్చుకొని వారికి నేత్రదానం ఆవశ్యకతను వివరించారు. ఇందుకుగాను తెలంగాణ నేత్ర అవయ శరీర దాతల అసోసియేషన్(వరంగల్) అధ్యక్షుడు కొన్రెడ్డి మల్లారెడ్డి సహకారం తీసుకున్నారు.
ఆయనతో ముచ్చర్ల సహా చుట్టుపక్క గ్రామాల్లో, వారి బంధువుల్లో ఎవరు చనిపోయినా వారి ఇంటికి వెళ్లి నేత్రాలను దానం చేయడం వల్ల కలిగే మేలు వివరించేవారు. మరో ఇద్దరికి చూపు వస్తే వారు లోకాన్ని చూస్తారని చెప్పి చైతన్యం తీసుకొచ్చారు. ఇలా చాలామంది ముందుకొచ్చి నేత్రదానం చేస్తుండడంతో ఇప్పటివరకు 60కి పైగా పూర్తయ్యాయి. ఫలితంగా ముచ్చర్ల గ్రామం రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందింది. చనిపోయిన వ్యక్తి నుంచి 8గంటల లోపు వారి నేత్రాలను వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సిబ్బంది, ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ నిపుణుల ద్వారా సేకరించి హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ దవాఖానకు తరలిస్తారు. సంస్థ సభ్యులు మృతిచెందిన కుటుంబ సభ్యులకు 11వ రోజున అభినందన సభ ఏర్పాటుచేసి వారికి అభినందన పత్రాన్ని అందజేస్తారు.