హనుమకొండ, ఆగస్టు 21 : హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ బ్యాంకులో నాబార్డు ఆధ్వర్యంలో బ్యాంకర్లకు వ్యవసాయ రుణాలు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, డిపార్ట్మెంట్ ఆఫ్ రీ ఫైనాన్స్ బిజినెస్ స్ట్రాటజీ అండ్ రీ ఫైనాన్స్పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో డీసీసీబీ, ఆర్ఆర్బీ, వాణిజ్య బ్యాంకులతో పాటు వివిధ బ్యాంకులకు చెందిన సుమారు 120 మంది ప్రతినిధులు, అధికారులు హాజరుకాగా, నాబార్డ్ టీజీఆర్వో డీజీఎం ప్రియాంక సైనీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
డీజీఎంతో పాటు ఎం దీప్తి, వరుణ్ వ్యవసాయం, అనుబంధ రంగాలు, మౌలిక సదుపాయాల్లో ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్, రుణాలు, రీఫైనాన్స్పై అవకాశాలపై మార్గనిర్దేశం చేశారు. అలాగే, ప్రియాంక సైనీ చేతుల మీదుగా పలు రుణాలు, ప్రాజెక్టులకు మంజూరు పత్రాలు అందజేశారు. మహబూబాబాద్ జిల్లా మన్నెగూడెం పీఏసీఎస్కు పీఏసీఎస్ యాక్సిలరేటర్ ప్రాజెక్టు, ఫిషరీష్ ఎఫ్పీవోకు చెందిన మహిళా మత్స్య రైతులకు 8 కేసీసీ ఫిషరీస్ లోన్స్, పాడి రైతులకు మూడు డైరీ కేసీసీ లోన్స్, వరంగల్లో సెలూన్ ఏర్పాటుకు ఒక సీజీటీఎంఎస్ఈ రుణ మంజూరు పత్రాలను అందజేశారు.
అనంతరం స్టాళ్లను సందర్శించారు. అలాగే, నిట్ వరంగల్ను సందర్శించిన డీజీఎం, డీడీఎంలు ఏఐ ఆధారిత జీవ వృత్తాకార ఆర్థిక వ్యవస్థ పరిశోధనా కేంద్రం, వేస్ట్ టు వెల్త్, స్టార్టప్స్, పేటెంట్స్, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో సహకార అవకాశాలను పరిశీలించారు. వరంగల్ ఆర్సీవోను సందర్శించి జీఎల్సీ పెంపు, పీఎల్పీ, కొత్త రుణాల ప్రతిపాదనలు, కొనసాగుతున్న ప్రాజెక్టులపై సమీక్షించారు. కార్యక్రమంలో హనుమకొండ నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, మహబూబాబాద్ డీడీఎం రవి, జనగామ, వరంగల్ డీడీఎంలు, వరంగల్ డీసీసీబీ సీవో వజీర్ సుల్తాన్, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.