ములుగు రూరల్, ఫిబ్రవరి 2 : రక్తం పంచుకొని పుట్టిన అన్నను తమ్ముడు కరెంట్ షాక్తో హతమార్చాడు. ఈ సంఘటన ములుగు మండలం మల్లంపల్లి శివారు రాజుపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్తి, భూ తగాదాలను మనసులో పెట్టుకొని అన్నను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని భార్య మాధవితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. భర్త మృతిపై అనుమానం వచ్చిన సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. కేసు వివరాలను శుక్రవారం ఎస్సై వెంకటేశ్వర్తో కలిసి సీఐ మేకల రంజిత్ వెల్లడించారు. రాజుపల్లి గ్రామానికి చెందిన కావటి భిక్షపతి(42) అతని తమ్ముడు కావటి సుధాకర్కు మల్లంపల్లి శివారులో తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన వ్యవసాయ భూమి ఉంది. భిక్షపతి రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. కాగా, పదేళ్లుగా భిక్షపతి, సుధాకర్ మధ్య ఆస్తి పంపకం, పొలం బాట విషయంలో గొడవలు జరుగగా పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగాయి.
దీనిని మనసులో పెట్టుకున్న సుధాకర్ మల్లంపల్లి శివారు పంట పొలం గట్టమ్మ గుట్టకు దగ్గరగా ఉండగా అడవి జంతులను నుంచి రక్షణకు జేవైర్తో కరంట్ అమర్చాడు. కాగా, జనవరి 31న చేను వద్దకు వెళ్లిన భిక్షపతి నీరు పారిస్తున్న క్రమంలో స్టాటర్ నుంచి చేను చుట్టూ ఉన్న జేవైర్కు సుధాకర్, అతని భార్య మాధవి కరెంటు కనెక్షన్ ఇచ్చారు. ఆ వైరు భిక్షపతికి తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సుజాత సుధాకర్పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో సుధాకర్, అతని భార్య మాధవి, దగ్గరి బంధువు గజ్జల భాస్కర్ వద్దకు వెళ్లి భిక్షపతిని తామే చంపామని చెప్పారని తెలిపారు. అతని ద్వారా శుక్రవారం ములుగు పోలీస్ స్టేషన్లో ఎస్సై వెంకటేశ్వర్ ఎదుట నిందితులు లొంగిపోయారన్నారు. దీంతో గ్రామానికి వెళ్లి పంచనామా నిర్వహించినట్లు సీఐ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించినట్లు చెప్పారు.