వరంగల్ చౌరస్తా, జనవరి 14: అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది సూపర్ స్పెషాలిటీ దవాఖాన పరిస్థితి. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ఆధునిక యంత్ర పరికరాలను అందించినా వాటిని వినియోగంలోకి తీసుకురావడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తద్వారా ఎంజీఎం సేవలపై ఒత్తిడి పెరుగుతున్నది. సుమారు రూ. 150 కోట్ల వ్యయంతో కేఎంసీలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన(పీఎంఎస్ఎస్వై) నిర్మాణం చేపట్టి ప్రజలకు ఆధునిక కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నారు. అయితే, అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు. అనారోగ్యంతో వచ్చిన వ్యక్తికి పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేయడంలో ప్రధాన భూమికను పోషించే పారా మెడికల్ సర్వీసుల్లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. సూపర్స్పెషాలిటీ వైద్యంలో పారా మెడికల్ నివేదికలది అత్యంత ప్రధాన పాత్ర. రోజుకు వందలు, వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహించే ఆధునిక యంత్ర పరికరాలు కలిగి ఉండి, పరీక్షలు నిర్వహించగలిగే సామర్థ్యం ఉన్న 16 మంది పారా మెడికల్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా యంత్ర పరికరాలు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఎంజీఎం ల్యాబ్పై ఆధార పడాల్సిన అవసరం ఏర్పడుతున్నది. దీంతో అత్యాధునిక పారామెడికల్ సేవలు రోగులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి.
ఎంజీఎం ల్యాబ్లో సేవలు ఆలస్యం..
సూపర్ స్పెషాలిటీ దవాఖానలో లక్షల రూపాయల విలువైన ఫుల్లీ ఆటోమెటిక్ అనలైజర్ యంత్రం, సెమి ఆటోమెటిక్ అనలైజర్ యంత్రాలు ఉన్నాయి. ఇవి నిరుపయోగంగా ఉండడంతో ఎంజీఎం ల్యాబ్పై ఆధార పడాల్సిన వస్తున్నది. దీంతో నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఎంజీఎం ల్యాబ్లో సేవలు ఆలస్యమవుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచే రోజుకు సుమారు 100 నుంచి 120 మంది రోగులు పరీక్షల కోసం ఎంజీఎంకు వస్తున్నారు. ఎంజీఎంతోపాటుగా సూపర్ స్పెషాలిటీలో రోగుల నమూనాల పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించడం ఆలస్యం అవుతున్నది. దీంతో రోగ నిర్ధారణ కోసం తరచూ దవాఖానకు రావాల్సి వస్తున్నదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి ఆధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.