నెక్కొండ, జూలై 29: నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని, అధిక మెజార్టీ సాధించడమే మన లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండలోని వాసవీ కల్యాణ మండపంలో శనివారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రానున్న మూడు నెలలు బీఆర్ఎస్ శ్రేణులు అత్యంత కీలకంగా పని చేయాలని కోరారు. ఏ గ్రామానికి వెళ్లినా 80 నుంచి 90 శాతం ఓటర్లు బీఆర్ఎస్ వారేనన్నారు. గతంతో పోల్చితే ప్రతి గ్రామంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయని వివరించారు. ప్రజల ఆశీస్సులు, అందరి ఐక్యత, సహాయ సహకారాలతోనే అనేక పైలట్ ప్రాజెక్ట్లకు నర్సంపేట కేంద్ర బిందువుగా మారిందన్నారు. అందుకే నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమైందన్నారు. పాకాల రంగయ్య చెరువు ప్రాజెక్ట్, కావాల్సినన్ని గురుకుల పాఠశాలలు, నర్సంపేటకు 250 పడకల దవాఖాన, మెడికల్ కాలేజ్ మంజూరు వంటివి చరిత్రలో నిలిచిపోతాయన్నారు. తనకు నిత్యం ప్రజల మధ్య ఉండడం, ప్రభుత్వం నుంచి పనులు మంజూరు చేయించడం తప్ప ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు లేవన్నారు. పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకం కావాలని సూచించారు. సంక్షేమం, అభివృద్ధితోపాటు సామాజిక బాధ్యతతో ప్రజలకు సహాయ సహకారాలు అందించాని సూచించారు. ఒకప్పుడు నియోజకవర్గంలో రాజకీయ హత్యలు, నిత్యం కొట్లాటలు ఉండేవని, ఆ స్థాయి నుంచి క్రైమ్ రేట్ను సాధ్యమైనంత వరకు తగ్గిస్తూ వస్తున్నామన్నారు.
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నట్లు ఎమ్మెల్యే పెద్ది వివరించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని, ప్రభుత్వ పనితీరును గ్రామస్థాయిలో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి పక్షాల చౌకబారు విమర్శలు, అసత్య ప్రచారాలకు ఎక్కడా కుంగిపోకుండా మనమంతా ప్రగతితోనే వారికి సమధానం చెప్పాలని పిలుపునిచ్చారు. నర్సంపేట నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడంలో కీలకప్రాత పోషిస్తున్న పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పెద్ది ధన్యవాదాలు తెలిపారు. రెట్టింపు ఉత్సాహంతో పార్టీ బలోపేతం కోసం, నిర్దేశించిన మెజార్టీని సాధించేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, నెక్కొండ, రెడ్లవాడ, సూరిపల్లి సొసైటీల చైర్మన్లు మారం రాము, జలగం సంపత్రావు, ఘంటా దామోదర్రెడ్డి, జడ్పీటీసీ లావుడ్యా సరోజా హరికిషన్, అబ్దుల్ నబీ, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, మండల నాయకులు తాటిపెల్లి శివకుమార్, కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, కొణిజేటి భిక్షపతి, బొల్లెబోయిన వీరస్వామి, దొనికెన సారంగం పాల్గొన్నారు.
మరమ్మతు పనుల పరిశీలన
నెక్కొండ మండలంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న నెక్కొండ-నర్సంపేట రోడ్డు మరమ్మతు పనులను ఎమ్మెల్యే పెద్ది పరిశీలించారు. నెక్కొండలో పెట్రోల్ పంపుల వద్ద వట్టెవాగు వరద ఉధృతికి రోడ్డు తీవ్ర కోతకు గురికావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. యుద్ధప్రాతిపాదిక మరమ్మతులు చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా వర్షానికి దెబ్బతిన్న ప్రతిచోట ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. రోడ్డు మరమ్మతు పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు.