మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే తెలంగాణ సర్కారు ధ్యేయమని, ఇందుకోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం పాలకుర్తిలోని డీసీసీ బ్రాంచి ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుశిక్షణను పంచాయతీరాజ్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడంతోపాటు వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందాలని కోరారు. సమైక్య పాలనలో రాష్ట్రంలోని మహిళలకు రూ.4 వేల కోట్ల రుణాలిస్తే తెలంగాణ వచ్చాక రూ.18 వేల కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. వరంగల్, కొడకండ్లలో టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
పాలకుర్తి రూరల్, డిసెంబర్ 26: మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలన్నాదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహిళా సాధికారతకు తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నదన్నారు. సోమవారం మండల కేంద్రంలోని డీసీసీ బ్యాంకు ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, కలెక్టర్ శివలింగయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, సందీప్కుమార్ సుల్తానియాకు మహిళలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళలకు ఎంతగానో ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని, నాడు ఎన్టీఆర్, నేడు సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు.
తెలంగాణ రాక ముందు మహిళలకు 4వేల కోట్ల రుణాలిస్తే, తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో రూ.18వేల కోట్ల రుణాలను మంజూరు చేశారన్నారు. మహిళలు ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్త్రీ నిధి ద్వారా ప్రతి మహిళకు రూ.3లక్షల రుణాలను మంజూరు చేసినట్లు చెప్పారు. చదువుకున్న మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, వ్యాపార వేత్తలుగా ఎదగాలని కోరారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే నియోజకవర్గంలోని ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నారు. వరంగల్, కొడకండ్లలో టెక్స్టైల్, మినీ టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు ప్రతి గ్రామంలో సమాఖ్య భవనాలను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తొలుత మంత్రిగా పాలకుర్తి నియోజక వర్గంలోనే ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రతి పక్షాలవి మూర్ఖపు మాటలని, వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, ప్రభుత్వ దవాఖానలో ప్రసవిస్తే కేసీఆర్ కిట్ ఇస్తున్నట్లు తెలిపారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు అందిస్తున్నామన్నారు. సందీప్కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు లక్ష్యమన్నారు. రూ.200కోట్ల విలువైన దుస్తులు కుట్టడం కోసం రూ.40వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ఫ్లిప్కార్ట్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ.. జనగామ జిల్లాలో పాలకుర్తిలో ప్రథమంగా ప్రారంభిస్తున్నామన్నారు. 3వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణను నేర్పిస్తున్నామన్నారు. మంత్రి ఎర్రబెల్లి సహకారంతో జిల్లాను అభివృద్ధిపథంలో నిలుపుతామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు సుధ మహిళలు తదితరులు పాల్గొన్నారు.