వరంగల్, మార్చి 6 : మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు ముగిసింది. ఏడు రోజుల పాటు హుండీల లెక్కింపు ప్రక్రియ దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో కొనసాగింది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏడు రోజుల్లో 540 హుండీల ద్వారా రూ.13,25, 22,511 ఆదాయం వచ్చింది. నోట్లు, చిల్లర నాణేలతో పాటు భక్తులు బంగారం, వెండి వస్తువులను అమ్మవార్లకు కానుకలుగా సమర్పించారు. 779.800 గ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి వస్తువులు కానుకలుగా వచ్చాయి.
హుండీల ద్వారా వచ్చిన నాణేలను లెక్కించిన అధికారులు వాటిని క్లాత్ సంచుల్లో మూటలు కట్టి బ్యాంకులకు తరలించారు. హుండీల ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు హెచ్డీఎఫ్సీ, యూనియన్, కెనరా బ్యాంకుల్లో జమ చేశారు. వారం రోజుల పాటు సాగిన మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియను దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్రావు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, మేడారం జాతర ఈవో రాజేంద్రం పర్యవేక్షించారు. దేవాదాయ శాఖ సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థలకు చెందిన సుమారు 350 మంది హుండీల లెక్కింపులో పాల్గొన్నారు.