ములుగురూరల్, జనవరి 4 : మేడారం మహా జాతరలో వైద్య సిబ్బంది సేవా భావంతో విధులు నిర్వర్తిస్తూ, భక్తులకు వేగవంతమైన సేవలు అందించి జాతరను విజయవంతం చేయాలని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీందర్నాయక్ అన్నారు. ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య సిబ్బంది భక్తులకు నిస్వార్థమైన సేవలు అందించాలన్నారు.
వైద్య శిబిరాల్లో సరిపడా సిబ్బందిని ములుగు జిల్లా నుంచే కాకుండా వరంల్, జనగామ, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల నుంచి తీసుకోవాలని సూచించారు. అనంతరం రవీందర్నాయక్కు డీఎంహెచ్వో అప్పయ్య, వైద్యాధికారి రవీందర్నాయక్ మేడారం అమ్మవార్ల చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సమావేశంలో ములుగు, వరంగల్ డీఎంహెచ్వోలు డాక్టర్ అప్పయ్య, డాక్టర్ సాంబశివరావు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.