నమస్తే తెలంగాణ నెట్వర్క్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో వామపక్షాల నాయకులు ధర్నాలు, ర్యాలీలు తీశారు. కాజీపేట పట్టణంలో కార్మిక సంఘాల కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జక్కు రాజుగౌడ్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు కమలాపూర్ బస్టాండ్ నుంచి పనిగట్ల వరకు ర్యాలీ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. హెచ్పీ గ్యాస్ ప్లాంట్ వద్ద కార్మికుల చట్టాలను రద్దు చేయాలని నిరసన తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఐఎస్బీ, ఏఐఎఫ్డీస్, ఏఐడీఎస్వో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంజీఎం దవాఖాన సెంటర్లో మానవహారం, ధర్నా నిర్వహించారు. నాయకులు శరత్, ప్రశాంత్, అర్జున్ అరవింద్ మాట్లాడుతూ.. చరిత్రను వక్రీకరించే ఎన్సీఈఆర్టీ సిలబస్ మార్పులను ఆపాలన్నారు. సీఐటీయూ గ్రేటర్ కార్యదర్శి ఉప్పలయ్య ఆధ్వర్యంలో పలు విభాగాల కార్మికులు బల్దియా కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అలాగే సంగెం, గీసుగొండ, పరకాల మండలాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
నర్సంపేటలో బీఆర్టీయూ, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐఎఫ్టీయూ (న్యూ), ఐఎఫ్టీయూ, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ రోడ్డు కూడలి నుంచి పాకాల రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈసంపెల్లి బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అలాగే, వర్ధన్నపేటలో కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ప్రతినిధులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నెక్కొండలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చాగంటి వెంకటయ్య, గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చాగంటి వెంకటయ్య ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక సమ్మె, గ్రామీణ బంద్ విజయవంతమైంది. ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఐనవోలులోని తహసీల్దార్ కార్యాలయం నుంచి తెలంగాణ తల్లి సెంటర్ వరకు తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, వృత్తిదారుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
సీపీఎం మండల కార్యదర్శి కే లింగయ్య మద్దతు తెలిపారు. వరంగల్ ట్రైసిటీలో చేపట్టిన ఆటో ల బంద్ విజయవంతమైనట్లు తెలంగాణ ఆటోడ్రైవర్స్ యూనియన్ నాయకులు, సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఈసంపెల్లి సంజీవ, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మడికొండ బాబు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కలకోట్ల జయరాం, పసునూరి బాబు, బొల్లం సంజీవ, అమీర్, ఈశ్వర్, రవీందర్, యాకూబ్పాషా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆటో కార్మికుల జీవితాలను రోడ్డున పడేసిందని ధ్వజమెత్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 56 వేల మంది ఆటో కార్మికుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ బంద్కు పూర్తి మద్దతునిచ్చింది. లారీలను కార్యాలయంలోని పార్కింగ్లోనే నిలిపివేసి నిరసన తెలిపారు. అధ్యక్షుడు గోరెమియా, ఉపాధ్యక్షుడు సుదాటి రాజు, కార్యదర్శి ఎర్రబెల్లి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఏఐఎఫ్టీయూ(న్యూ) మండల అధ్యక్షుడు లింగన్న ఆధ్వర్యంలో ఖానాపురంలో ర్యాలీ నిర్వహించారు. పర్వతగిరిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.