ఖిలావరంగల్, ఫిబ్రవరి 20 : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు 54 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో భూ సంబంధిత సమస్యలపై 28 ఫిర్యాదులు అందాయి. అలాగే ఎంజీఎంకు సంబంధించిన 3, ఎస్సీ కార్పొరేషన్ ఒకటి, జీడబ్ల్యూఎంసీ 3, వరంగల్ ఆర్డీవో 5, నర్సంపేట ఆర్డీవో 2, కుడా, డీఆర్డీవో, డీటీడీవో, డీపీవో, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ విభాగాలకు సంబంధించి బాధితులు వినతిపత్రాలు అందించారు.
వరంగల్ బీసీడీవోపై ఐక్య విద్యార్థి సంఘం నాయకులు బోట్ల నరేశ్, ల్యాదల్ల శరత్, శ్రీకాంత్, మైనంపల్లి కిరణ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కింది స్థాయి ఉద్యోగులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, గత ఏడాది కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపారు. నెలకు రూ.20 వేల అద్దెతో కారు తీసుకొని చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కారు యజమాని కిరణ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చాడు. రూ.90 వేల బకాయిలు ఇవ్వడం లేదన్నారు.
ట్రెజరీ కార్యాలయంలో కూడా దొంగ బిల్లులు సృష్టించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. నర్సంపేట మహేశ్వరానికి చెందిన పాశం తిరుపతమ్మ తనకు వితంతువు పింఛన్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోయాడని, అప్పటి నుంచి దరఖాస్తు పెట్టుకుంటున్నా ఎలాంటి కారణాలు చెప్పకుండా తిరస్కరిస్తున్నారని తెలిపారు. పింఛన్ ఇప్పించాలని వినతిపత్రంలో కోరారు.
అలాగే వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు కట్ట పనుల్లో అవినీతి జరుగుతున్నదని, అధికారులు చెరువు మట్టిని ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నట్లు మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా జాక్ కన్వీనర్ శ్రీనివాస్ కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ట్రై సైకిల్ కావాలని సంగెం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన సంపత్రెడ్డి, చిరంజీవి కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సంబంధిత సమస్యలను నిబంధనల మేరకు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా బాధితుడికి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్డీవో సంపత్రావు, ఆర్డీవో మహేందర్జీ తదితరులు పాల్గొన్నారు.
సేవాలాల్ జయంతి కరపత్రాల ఆవిష్కరణ..
ఈ నెల 22న వరంగల్ యాకూబ్పురలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ప్రభుత్వం నిర్వహించనున్న సేవాలాల్ మహరాజ్ జయంతి కరపత్రాలను కలెక్టర్ గోపి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఏ నర్సింహమూర్తి, డీటీవో జహీరుద్దీన్, బంజారా నాయకులు గుగులోత్ సజ్జన్నాయక్, బాలాజీనాయక్, వెంకట్నాయక్ పాల్గొన్నారు.