హనుమకొండ, నవంబర్ 4 : డిసెంబర్ 10,11,12 తేదీల్లో జరిగే పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షురాలు, ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో మహాసభ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాత్యాయని విద్మహే మాట్లాడుతూ చారిత్రాత్మక పోరాట వారసత్వం ఉన్న పీడీఎస్యూ రాష్ర్ట మహాసభలు ఉద్యమాల కేంద్రం వరంగల్ జిల్లాలో నిర్వహించడం అభినందనీయ మన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలన విద్య పేదలకు మరింత దూరమవుతుందన్నారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా నేటికీ విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు పేద బడుగు బలహీన వర్గాలకు అందకుండా ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకుంటున్నాయన్నారు. మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి మైసా శ్రీనివాస్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా విద్యార్థులకు ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తుందన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జాతీయ నాయకులు పి.మహేష్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పి.నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనగిరి మధు, డాక్టర్ రాజేష్, గుర్రం అజయ్, మర్రి మహేష్, రాజేందర్, బాలరాజు, బండి కోటేశ్వర్ పాల్గొన్నారు.