హనుమకొండ చౌరస్తా, జూలై 9 : కాకతీయ విశ్వవిద్యాలయం న్యాక్ ఏ-ప్లస్ గ్రేడ్ సాధించింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా 2017, సెప్టెంబర్ 12న ఏ-గ్రేడ్ గుర్తింపు పొందగా ఇప్పుడు న్యాక్ ఏ-ప్లస్ సాధించినట్లు న్యాక్ నుంచి ఉన్నతాధికారులకు సమాచారం అందింది. మే 25 నుంచి 27 వరకు న్యాక్ బృందం కేయూలో పర్యటించింది. ఆగ్రాలోని డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు, న్యాక్ బృందం చైర్మన్ ఆచార్య సుగం ఆనంద్, కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం హనుమంతప్ప, సభ్యులు డాక్టర్ పంకజ్ కే శ్రీవాస్తవ, డాక్టర్ జయంత్ సన్వాల్కర్, డాక్టర్ బులు మహారాణా, డాక్టర్ సారిక శర్మ, డాక్టర్ సుజాత పీలా సందర్శించారు.
కేయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ విశ్వవిద్యాలయ ప్రగతిని కమిటీకి పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. మార్పులు, అవగాహన ఒప్పందాలు, నూతన కోర్సులు, సంసరణలు, విద్యార్థులకు అందించే సేవలు, వనరుల సమీకరణ, పూర్వ విద్యార్థుల సంఘాలు, భవిష్యత్ ప్రణాళికలు గురించి తెలిపారు. అనంతరం న్యాక్ బృందం కామర్స్ కళాశాల, కంప్యూటర్ సైన్స్ డిపార్టుమెంట్, బయోటెక్నాలజీ డిపార్టుమెంట్, లైబ్రరీ సైన్సు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బోటనీ డిపార్టుమెంట్లు, విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కాలేజీ (కో- ఎడ్యుకేషన్), ఇంగ్లిష్, కెమిస్ట్రీ, ఎడ్యుకేషన్, దూరవిద్యా కేంద్రం, జియాలజీ, గణితశాస్త్రం, పరీక్షల విభాగం, లైబ్రరీ, భౌతికశాస్త్ర విభాగాలు, గ్రంథాలయాన్ని పరిశీలించారు.
న్యాక్ ఏ-ప్లస్ వల్ల ఎన్నో లాభాలు..
విశ్వవిద్యాలయానికి న్యాక్ ఏ-ప్లస్ గ్రేడ్ వల్ల ఎన్నో లాభాలు చేకూరనున్నాయి. విశ్వవిద్యాలయానికి పరిశోధన, బోధన అభివృద్ధి నిధులు కేటాయింపు పెరుగనున్నది. జాతీయ నూతన విద్యావిధానం అమల్లోకి వస్తున్న తరుణంలో న్యాక్ ఏ-ప్లస్ గ్రేడ్ వల్ల స్వయం ప్రతిపాదిక కోర్సుల నిర్మాణానికి ఉపయోగకరంగా మారుతుంది. దూరవిద్యా కేంద్రం కోర్సుల నిర్మాణం స్వతహాగా చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. పాత కోర్సులనూ పునరుద్ధరించుకోవచ్చు.
నిధుల కేటాయింపు పెరుగుతుంది..
కేయూ న్యాక్ ఏ-ప్లస్ గ్రేడ్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. పరిశోధన, బోధన అభివృద్ధి, నిధుల కేటాయింపు పెరుగుతుంది. విశ్వవిద్యాలయంలో స్వయం ప్రతిపాదిక కోర్సుల నిర్మాణానికి ఉపయోకరంగా మారనుంది. దూరవిద్యా కేంద్రం కోర్సులను సొంతంగా రూపొందించుకోవచ్చు. కొత్త కోర్సులను ప్రారంభించుకోవడంతో పాటు పాత కోర్సులను కూడా మళ్లీ పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది.
– ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, కేయూ వైస్ చాన్స్లర్