స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 3 : ‘ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణను సాధించుకున్నాం.. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా అభివృద్ధి చేశామనే సంతృప్తి ఉందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు మరోసారి ఆశీర్వదించి విజయం అందించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు అధికార పక్షంగా పాత్ర పోషించామని, ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ముందుకెళ్తామన్నారు. తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండని ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ నేతలు ప్రజలను వేడుకోవడంతో ఈ తీర్పు వచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయాలని కోరారు.
జనగామ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరిని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజయ్య అభినందించారు. వారిని కలిసి పూలమాలలతో సత్కరించి అభినందించారు. ఇదిలా ఉండగా ఓట్ల లెక్కింపు కేంధ్రం వద్దకు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కడియం శ్రీహరికి శుభాకాంక్షలు తెలిపారు.