హనుమకొండ చౌరస్తా : దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ( Konda Surekha )కు షోకాజ్ నోటీసు ( Show cause notice ) జారీ చేసిన వ్యవహారంపై వివిధ బీసీ సంఘాల నాయకులు ( BC leaders ) తీవ్రంగా స్పందించారు. బీసీల పట్ల ఒక రకమైన న్యాయం, రెడ్డి సామాజిక వర్గం పట్ల మరో రకమైన న్యాయం జరుగుతోందని బీసీ ఐక్యవేదిక నాయకులు ప్రశ్నించారు.
శనివారం హనుమకొండ ప్రెస్క్లబ్లో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సామాజికవేత్త, బీసీ ఉద్యమ నాయకుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డికి చెందిన సామాజిక వర్గానికి చెందిన కొంతమంది శాసనసభ్యులు అనేక సందర్భాల్లో ఏకవచనంతో విమర్శించినప్పటికీ, అప్పట్లో ప్రభుత్వం అదే స్థాయిలో స్పందించలేదని ఆరోపించారు.
బీసీ మహిళగా, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ విషయంలో మాత్రం ప్రభుత్వం అతిగా స్పందించి షోకాజ్ నోటీసు జారీ చేయడం పట్ల బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. బీసీ మహిళా మంత్రి విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సామాజిక న్యాయం సూత్రాలకు అనుగుణంగా ఉందా అని ప్రశ్నించారు. ఈ సమావేశం లో వివిధ కులసంఘాల బీసీ నాయకులు రాంపెల్లి లింగమూర్తి, ఆడెపు సుధాకర్, డాక్టర్ మియాపురం శివుడు, గోవిందుల జనార్ధన్, టౌటం శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.