ధాన్యం కొనుగోళ్లలో రాష్ర్టానికే ఆదర్శం
ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్
చైర్మన్ను సన్మానించిన ప్రజాప్రతినిధులు
ఖానాపురం, జూన్ 10: పక్కా ప్రణాళిక.. అధికారుల సహకారం.. సిబ్బంది, రైతుల సమష్టి కృషితోనే ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా పూర్తి చేసి రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచినట్లు ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. పాకాల ఆయకట్టు పరిధిలోని రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లను కేవలం 15 రోజుల్లోనే పూర్తి చేసిన నేపథ్యంలో సర్పంచ్ల ఫోరం మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం రామస్వామినాయక్ను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ గతంలో పాకాల ఆయకట్టు పరిధిలో యాసంగి సాగును ఆలస్యంగా చేపట్టేవారన్నారు. దీంతో ధాన్యం కొనుగోలు సమయంలో వర్షాలు పడి రైతులకు తీవ్రనష్టం వాటిల్లేదని తెలిపారు.
ఈ ఏడాది ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి రైతులకు అవగాహన కల్పించారని, దీంతో ఏప్రిల్ 15 వరకు నాట్లు పూర్తి చేసుకోవడంతో మే 10లోగా వరికోతలు పూర్తయినట్లు వివరించారు. పాకాల ఆయకట్టు కింద 13 వేల ఎకరాల్లో వరి పంట సాగైందని చెప్పారు. 5,500 మంది రైతులకు సంబంధించిన రూ. 60 కోట్ల విలువైన పంట చేతికొచ్చిందని తెలిపారు. కరోనా సమయంలోనూ అన్నదాతలకు ఇబ్బందులు కలుగొద్దని ఎమ్మెల్యే పెద్ది ఆదేశాల మేరకు నిత్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సహకారంతో కొనుగోళ్లు పూర్తి చేశామని చెప్పారు. ఇప్పటికే 90 శాతం మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అయినట్లు వెల్లడించారు. సొసైటీలో ఐదు వేల బస్తాల యూరియా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోళ్లకు సహకరించిన ఎమ్మెల్యే, సివిల్ సప్లయ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, సొసైటీ సిబ్బందికి ఈ సందర్భంగా చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.
6.11 లక్షల బస్తాల ధాన్యం కొనుగోలు
ఖానాపురం సొసైటీ పరిధిలోని ఐనపల్లి, అశోక్నగర్, బుధరావుపేట, ధర్మరావుపేట, ఖానాపురం, కొత్తూరు, మనుబోతులగడ్డ, మంగళవారిపేట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2905 మంది రైతుల నుంచి 6,11,507 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కాస ప్రవీణ్కుమార్, సొసైటీ వైస్ చైర్మన్ వేణుకృష్ణ, ఎంపీటీసీ భారతి, మస్తాన్, అశోక్, సుమన్, పూర్ణచందర్, సర్పంచ్ ఐలయ్య, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.